కోల్కతా, నవంబర్ 18: చోరీ కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్కు అరెస్ట్ వారంట్ జారీ చేసిన రెండు రోజులకే మరో కేంద్ర మంత్రికి బెంగాల్లోని ఓ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ 2019, ఏప్రిల్ 4న తుఫాన్గంజ్లో కేంద్ర మైనార్టీ వ్యవహారాల సహాయ మంత్రి జాన్ బార్లా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పోలీసుల అనుమతి కూడా తీసుకోలేదు. దీంతో స్థానిక బోక్సిర్హాట్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో పలుమార్లు తుఫాన్గంజ్ సబ్ డివిజనల్ కోర్టు సమన్లు జారీ చేసినా, ఆయన హాజరు కాలేదు. ఈ నెల 15న హాజరు కావాలని మరోసారి సమన్లు జారీ చేసింది.
అప్పటికీ ఆయన గానీ, ఆయన తరఫు లాయర్ గానీ హాజరు కాకపోవటంతో ఆగ్రహం వ్యక్తంచేసిన కోర్టు.. కోర్టు ధిక్కరణ కింద కేంద్ర మంత్రిపై అరెస్ట్ వారంట్ జారీ చేసింది. 72 గంటల వ్యవధిలో ఇద్దరు కేంద్ర మంత్రులకు కోర్టులు అరెస్ట్ వారంట్లు జారీచేయటం చర్చనీయాంశంగా మారింది. 13 ఏండ్ల కిందట దొంగతనం చేసిన కేసులో అలీపూర్దౌర్ జ్యుడీషియల్ కోర్టు ఈ నెల 14న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్పై అరెస్ట్ వారంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.