డెహ్రాడూన్: వివాహం చేసుకోవాలని అడుగుతున్నదని ఒత్తిడి చేస్తుండటంతో ఆర్మీ అధికారి ఓ నేపాలీ మహిళను హత్యచేసిన ఘటన ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో (Dehradun) జరిగింది. లెఫ్టినెంట్ కల్నల్ రామెండు ఉపాధ్యాయ్ (Lieutenant Colonel Ramendu Upadhyay) మూడేండ్ల క్రితం క్లెమెంట్ టౌన్ కంటోన్మెంట్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో సిలిగురిలోని (Siliguri) ఓ బార్లో డ్యాన్సర్గా (Bar Dancer) పనిచేస్తున్న నేపాలీ (Nepal) మహిళ శ్రెయా శర్మ (Shreya Sharma) ఆయనకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.
కొద్దికాలానికి ఆయనకు డెహ్రాడూన్కు (Dehradun) బదిలీ అయింది. దీంతో ఆమెను కూడా తనతోపాటే తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతనికి వివాహం అవడంతో.. డెహ్రాడూన్లో ఓ అపార్టుమెంట్లో ఫ్లాట్ కిరాయికి తీసుకుని శ్రెయా శర్మను అందులో ఉంచాడు. ఇలా మూడేండ్లుగా ఆమె వద్దకు వస్తూ పోతూ ఉన్నాడు. ఈ క్రమంలో తరచూ ఆమె తనను పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నది. అయితే గత శనివారం రాత్రి రాజ్పూర్ రోడ్డులోని ఓ క్లబ్లో ఇద్దరూ కలిసి మందు తాగారు. అనంతరం ఆమెను తన కారులో లాంగ్ డ్రైవ్కు తీసుకెళ్లాడు. రాత్రి 1.30 గంటల సమయంలో థానో పట్టణం దాటిన తర్వాత నిర్మాణుష్య ప్రదేశంలో కారును ఆపాడు. అనంతరం సుత్తెతో తలపై పలుమార్లు కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో లెఫ్టినెంట్ కల్నల్ ఉపాధ్యాయ్ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమ స్టైల్ విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.