శ్రీనగర్: ప్రమాదవశాత్తు జరిగిన కాల్పుల్లో (accidental firing) ఒక ఆర్మీ జవాన్ మరణించాడు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. జమ్ముకశ్మీర్లోని బందిపోరా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం బందిపోరాలోని ఆర్మీ క్యాంప్లో 14 రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన ఒక జవాన్ పొరపాటుగా కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఒక ఆర్మీ జవాన్ మరణించాడు. 37 ఏండ్ల యోగేష్ అనే మరో జవాన్కు బుల్లెట్ గాయాలయ్యాయి. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ప్రమాదవశాత్తు తోటి జవాన్లపై కాల్పులు జరిపిన జవాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కాల్పుల్లో మరణించిన సైనికుడి వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించలేదు.
మరోవైపు అనంత్నాగ్ జిల్లాలో జరుగుతున్న ఎన్కౌంటర్ ఆదివారం నాటికి ఐదో రోజుకు చేరింది. సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను ఆర్మీ సిబ్బంది హతమర్చారు. మిగతా టెర్రరిస్టులు దాగి ఉన్న ప్రదేశాన్ని కనుగొనేందుకు భద్రతా దళాలు డ్రోన్లను వినియోగిస్తున్నాయి.