తమిళనాడులోని కూనూర్ ప్రాంతంలో బుధవారం ఒక ఆర్మీ హెలికాప్టర్ కూలిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనలో సిడియస్ బిపిన్ రావత్తోపాటు ఆయన భార్య, 12 మంది సైనిక అధికారులు చనిపోయారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ కొండ గ్రామాలలో నివసించే వారు ముందుగా స్పందించారు.
ఆ గ్రామస్తులలో కొందరు ప్రత్యక్ష సాక్ష్యులు ఉన్నారు. ఆ ప్రత్యక్ష సాక్ష్యులలో ఒకరైన చంద్రకుమార్ అనే గ్రామస్తుడు మాట్లాడుతూ.. “హెలికాప్టర్ కూలగానే ఒక భారీ శబ్దం వినబడింది. ఆ సమయంలో నేను ఇంట్లోనే ఉన్నాను. బయటికి వచ్చి చూస్తే దట్టమైన పొగలు అలుముకొని ఉన్నాయి. దగ్గరకు వెళ్లి చూడగా.. ఒక హెలికాప్టర్ చెట్ల కొమ్మలపై భారీ అగ్ని జ్వాలలతో చిక్కుకొని ఉంది. అందులో నుంచి కొందరు కాపాడమని గట్టిగా అరుస్తున్నారు. ఏం చేయాలో తెలియక.. నేను నా పక్కింట్లో నివసించే.. శివకుమార్ని పిలిచాను అని అన్నాడు.
మరో ప్రత్యక్ష సాక్షి శివకుమార్ మాట్లుడుతూ.. “నేను వెంటనే పోలీసులకు సమాచారం అందించాను. వాళ్లు రావడానికి సమయం పడుతుందని భావించి 8 మంది గ్రామస్తులతో ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లాను. అక్కడ ఇద్దరు వ్యక్తులు పొదల్లో పడి ఉన్నారు. బహుశా.. వారిద్దరూ హెలికాప్టర్ నుంచి దూకేసి ఉంటారు. నేను వారి వద్దకు వెళ్లి చూస్తే వారి వస్త్రాలు పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. వారిలో ఒకరు దాహంగా ఉందని, నీరు కావాలని అడిగాడు. నేను అతడికి ఏమీ కాదని మేము తప్పకుండా సహాయం చేస్తామని చెప్పాను. కానీ ఇదంతా కొండ ప్రాంతం కావడంతో 500 మీటర్ల వరకు వాహనాలు చేరుకోలేవు. అందుకే వారిని అంత దూరం మోసుకొని వెళ్లాల్సి వచ్చింది ” అని వివరించాడు.
పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నాక ఎవరినీ అక్కడ ఉండడానికి అనుమతించలేదు. స్థానికులను వారి ఇళ్లలోనే ఉండాలని సూచన చేశారు.