శ్రీనగర్: ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా పోలింగ్ ప్రక్రియలో భారత్ సైన్యం, కేంద్ర సర్కారు జోక్యం చేసుకోవడం తగదని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా చెప్పారు. 1996లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలింగ్ టైమ్లో దోడా జిల్లాలోని ఓ గ్రామానికి వెళ్లానని, ఆర్మీ క్యాంప్లో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ బూత్ దగ్గర ఒక్క ఓటరు కూడా కనిపించలేదని చెప్పారు.
దాంతో పోలింగ్ బూత్ ఖాళీగా ఉన్నది ఎందుకని తాను ప్రశ్నించగా జనం ఎవరూ ఓటేయడానికి రాలేదని అక్కడున్న ఆర్మీ సిబ్బంది బదులిచ్చారని ఫరూఖ్ వెల్లడించారు. ఆ తర్వాత తాను గ్రామంలోని ఓ దుకాణదారు వద్దకు వెళ్లగా నిజం తెలిసిందన్నారు. పోలింగ్ బూత్ల దగ్గరికి ఎవరూ రావద్దని, ఎవరైనా వస్తే కాళ్లు విరగ్గొడుతామని సైనికులు హెచ్చరించినట్లు దుకాణదారు చెప్పాడని ఫరూఖ్ తెలిపారు.
ఈ నేపథ్యంలో తాను ఇండియన్ ఆర్మీకి, కేంద్ర సర్కారుకు ఒక విషయం చెప్పదలుచుకున్నానని, పోలింగ్ ప్రక్రియలో ఆర్మీగానీ, కేంద్రంగానీ జోక్యం చేసుకోవడం తగదని ఫరూఖ్ పేర్కొన్నారు. లేదంటే కశ్మీర్లో తుఫాను చెలరేగుతుందని, దాన్ని ఆపడం మీ తరం కాదని ఆయన హెచ్చరించారు.