Army Dog Zoom : జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన ఆర్మీ డాగ్ ‘జూమ్’ మృతి చెందింది. ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూమ్ గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.
దక్షిణ కశ్మీర్లోని తంగపావా ప్రాంతంలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నట్లు అధికారులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. వారిని గుర్తించే పనిని జాగిలాలకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంట్లోకి ‘జూమ్’ అనే ఆర్మీ డాగ్ను పంపించారు. ఆపరేషన్లో ఆర్మీ జాగిలం ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసింది. ఈ క్రమంలో రెండు తుపాకీ గుండ్లు దాని శరీరంలోకి దూసుకెళ్లాయి. అయినా పోరాటాన్ని కొనసాగించింది. దాని ఫలితంగానే భద్రతాబలగాలు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అనంతరం తీవ్రంగా గాయపడిన జూమ్ని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు.