కోల్కతా: ఆర్మీలో కుక్గా పని చేస్తున్న ఒక వ్యక్తి కిడ్నాప్ డ్రామా ఆడాడు (Army cook fakes own kidnapping). కొందరు తనను కిడ్నాప్ చేసి ఒక హోటల్ గదిలో బంధించారని కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వారితో చెప్పాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆర్మీ యూనిట్కు సమాచారం ఇచ్చారు. వారు పోలీసుల సహాయం కోరగా చివరకు ఆ ఆర్మీ కుక్ను ఒక హోటల్లో గుర్తించారు. తాగుడు కోసం అతడు కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తెలుసుకుని షాకయ్యారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది.
హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లా డెహ్రాకు చెందిన 35 ఏండ్ల అరుణ్ గులేరియా, అరుణాచల్ ప్రదేశ్లోని 20వ సిక్కు రెజిమెంట్లో కుక్గా పనిచేస్తున్నాడు. ఆగస్ట్ 12న వైద్యచికిత్స కోసం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని కమాండ్ హాస్పిటల్కు వెళ్లాడు. ఆ తర్వాత ఒక హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాడు. అక్కడ ఫుల్గా మద్యం సేవించాడు.
కాగా, తెచ్చిన డబ్బులు అయిపోవడంతో మరింతగా మద్యం తాగేందుకు ఆర్మీ కుక్ అరుణ్ సొంత కిడ్నాప్ డ్రామాకు తెరతీశాడు. తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. తనను కిడ్నాప్ చేసి ఒక హోటల్లో బంధించారని తెలిపాడు. కిడ్నాపర్లు రూ.40,000 డిమాండ్ చేస్తున్నారని చెప్పాడు. దీంతో అరుణ్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అరుణాచల్ ప్రదేశ్లోని ఆర్మీ యూనిట్కు ఈ విషయం చెప్పి వారిని అలెర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్మీ అధికారులు కోల్కతా పోలీస్ హెడ్క్వార్టర్స్లోని క్రైమ్ కంట్రోల్ రూమ్ను సంప్రదించారు. అరుణ్ ఆచూకీని గుర్తించేందుకు పోలీసుల సహాయాన్ని కోరారు.
మరోవైపు కోల్కతా పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన డిటెక్టివ్, యాంటీ రౌడీ బృందాలు రంగంలోకి దిగాయి. ఆర్మీ కుక్ అరుణ్ను గుర్తించేందుకు ప్రయత్నించాయి. మొబైల్ను ట్రేస్ చేసి అతడు ఉన్న హోటల్ను గుర్తించిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఫుల్గా మద్యం సేవించి హోటల్లో రూమ్లో పడి ఉన్న అరుణ్ను కనుగొన్నారు. అతడ్ని తమ వెంట తీసుకెళ్లారు.
కాగా, అరుణ్ను పోలీసులు ఆరా తీయగా అసలు విషయం తెలిపాడు. మరింతగా మద్యం తాగేందుకు డబ్బుల కోసం కిడ్నాప్ డ్రామా ఆడినట్లు చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కంగుతిన్నారు. అనంతరం అతడ్ని ఆర్మీ యూనిట్కు అప్పగించారు.