Naravane | ఆర్మీ నాగాలాండ్ పౌరులపై జరిపిన కాల్పుల ఘటన అట్టుడుకుతూనే వుంది. స్థానికులు ప్రతిరోజూ ఈ ఘటనను, ఏఎఫ్ ఎస్పీఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూనే వున్నారు. రెండు రోజుల క్రితం దాదాపు 70 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తూ, ఏఎఫ్ఎస్పీఏ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవాణే స్పందించారు. కాల్పుల ఘటనకు కారకులైన వారిపై సరైన చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు. వచ్చిన దర్యాప్తు ఆధారంగా కారకులైన వారిపై చర్యలు కచ్చితంగా ఉంటాయన్నారు. అలా జరగడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు. ఆర్మీ చీఫ్ నరవాణే బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగాలాండ్ కాల్పుల ఘటనపై విచారణ జరుగుతోందని అన్నారు. సరిహద్దుల్లో ఎంత సీరియస్ ఆపరేషన్లు సాగుతున్నా, తాము పౌరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకునే వ్యవహరిస్తామని అన్నారు.
పశ్చిమ సరిహద్దులో టెర్రరిస్టుల కార్యకలాపాలు పెరుగుతున్నాయని, లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పదే పదే చొరబాట్లకు ప్రయత్నిస్తూనే వున్నారని నరవాణే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బట్టి మన పొరుగు దేశ ప్రవర్తన ఎలా వుందో ఓ సారి ఊహించుకోవచ్చని నరవాణే అన్నారు. అయితే గత యేడాది నుంచి ఆ ప్రాంతాల్లో కాస్త పరిస్థితులు మెరుగుపడ్డాయని, ఇక ఇతర సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం ఎప్పుడూ అప్రమత్తతత, సన్నద్ధతతోనే ఉన్నామని నరవాణే పేర్కొన్నారు. చైనా ఆర్మీని సమర్థవంతంగా ఎదుర్కొంటామని, వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని ఆర్మీ చీఫ్ నరవాణే తేల్చి చెప్పారు. అయితే ఇప్పటికీ ఎల్ఏసీ వెంబడి చైనా ముప్పు మాత్రం కొనసాగుతోందన్నారు. అయితే దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఆర్మీకి తెలుసని, సమర్థవంతంగా ఎదుర్కొంటామని ప్రకటించారు.
గత యేడాది డిసెంబర్లో నాగాలాండ్లోని ఓటింగ్ గ్రామంలో ఆర్మీ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ సమయంలో ఆర్మీ పెద్ద పొరపాటు చేసింది. తీవ్రవాదులని పొరబడి, సాధారణ పౌరులపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 14 మంది అక్కడికక్కడే మరణించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఏఎఫ్ఎస్పీఏ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని నాగాలాండ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనకు కేంద్ర హోంమంత్రి అమిత్షా వెంటనే క్షమాపణలు చెప్పాలని, ఆ చట్టాన్ని రద్దు చేయాలని నాగాలు డిమాండ్ చేస్తున్నారు.