హైదరాబాద్ (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): అసలు గ్రహాంతరవాసులు ఉన్నారా ? ఉండి ఉంటే మనలాగే ఉంటారా ? భూమిని, మనుషుల్ని చూస్తుంటారా ? ఎప్పుడైనా భూమి మీదకు వచ్చారా ? ఇలా అనేక అంతుచిక్కని ప్రశ్నలు మానవాళిని నిత్యం వేధిస్తూనే ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికాలోని సెర్చ్ ఫర్ ఎక్స్ట్రాటెర్రెస్ట్రియల్ ఇంటెలిజెన్స్(సెటి) అనే సంస్థ ప్రత్యేకంగా ఈ పరిశోధనలే చేస్తూ ఉంటుంది.
తాజాగా ఈ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసులకు సంబంధించి ఒక కొత్త విషయాన్ని చెప్తున్నారు. గ్రహాంతరవాసులు భూమిని చూస్తుండవచ్చని, కాకపోతే రియల్ టైమ్లో చూడలేరని వీరు అంచనా వేస్తున్నారు. 3,000 ఏండ్ల క్రితం నాటి భూమిని, నాగరికతను, కట్టడాలను ఏలియెన్స్ ఇప్పుడు చూస్తుండవచ్చని చెప్తున్నారు.
ఈ ఆలస్యానికి వారు ఒక కారణాన్ని కూడా చెప్తున్నారు. భూమికి అనేక వేల కాంతి సంవత్సరాల దూరంలో ఏలియన్స్ ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి కాంతి ప్రయాణించడానికి చాలా సమయం పడుతుందట. ఈ ప్రయాణ సమయం 3,000 ఏండ్లు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏలియన్స్ వాళ్ల అత్యాధునిక టెలిస్కోప్లతో భూమిని చూస్తున్నప్పటికీ వారికి కనిపించేది మాత్రం 3,000 ఏండ్ల క్రితం నాటి భూమి అని, అప్పటి రోమన్లు, గ్రీకులు, భారతీయులు, ఈజిప్టియన్ల నాగరికతను ఏలియన్స్ ఇప్పుడు చూస్తుండవచ్చని భావిస్తున్నారు.