లక్నో : ఆగ్రాలో యమునా నది ఒడ్డున ఉన్న తాజ్ మహల్లోని 22 గదులకు సంబంధించిన చిత్రాలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సోమవారం విడుదల చేసింది. ఇటీవల పలు నిర్వహణ పనులు చేపట్టగా.. వారికి సంబంధించిన చిత్రాలను సైతం విడుదల చేశారు అధికారులు. ‘నదీ తీరంలో భూగర్భ గదుల నిర్వహణ పనులు చేపట్టామని.. పాడైన, శిథిలమైన లైమ్ పాస్టర్ను తొలగించి, మరమ్మతులు చేపట్టాం’ అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది.
తాజ్ మహల్ చుట్టూ ఉన్న గేట్వేలకు సైతం మరమ్మతులు చేపట్టామని పేర్కొంది. గదులకు సంబంధించిన ఫొటోలను వెబ్సైట్లో పొందుపరిచింది. ఇదిలా ఉండగా.. ఇటీవల అయోధ్యకు చెందిన డాక్టర్ రజనీష్ సింగ్ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్లో తాజ్ మహల్లో మూసి ఉన్న 22 గదలను తెరవాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. తాజ్ మహల్ వాస్తవానికి తేజో మహా శివాలయమని చిత్రకారులు పేర్కొన్నారంటూ పిటిషన్లో పేర్కొన్నారు.
తాజ్ మహల్ను దేవాలయంగా మార్చడం కాదని, వాస్తవాన్ని బయటకు తీసుకురావాలని, ఇలాంటి వివాదాలకు తెరపడాలంటే మూసి ఉన్న తలుపులను తెరవడం ఒకటే మార్గమని పేర్కొన్నారు. అయితే, పిటిషన్ను హైకోర్టు కొట్టి వేసింది. ఎలాంటి పరిశోధన చేయకుండా ఎలా పిటిషన్ వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజ్మహల్పై పూర్తి స్థాయి పరిశోధన చేసిన తర్వాతే.. పిల్ వేయాలని పిటిషనర్ని మందలిచింది. పిల్ను ఎగతాళి చేయవద్దని.. కనీసం అవగాహన లేకుండా.. ఇష్టానుసారం పిల్ వేస్తారా? అని మండిపడింది. మరో వైపు రాజస్థాన్కు చెందిన బీజేపీ ఎంపీ, పూర్వ జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియా కుమార్ తాజ్ మహల్ ఉన్న స్థలం తమదేనని పేర్కొన్నారు. అందుకు సంబంధించి ఆధారాలు తమ కుటుంబం వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.