Summer Weather | ఈ ఏడాది ఏప్రిల్ ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. 1901 తర్వాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు భారీగా రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు కొనసాగాయి. మే నెలలోనూ ఎండలు, వడగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగత్రలు చాలా ప్రాంతాల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని, 11 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇప్పటికే 2023 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కింది. భారత వాతావరణ విభాగం (IMD) డైరెక్టర్ జనరల్ మృత్యంజయ్ మోహపాత్ర మాట్లాడుతూ ఏప్రిల్ 5 నుంచి 7 వరకు, 15 నుంచి 30 వరకు వడగాలులు వీచినట్లు తెలిపారు.
సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదైందని తెలిపారు. ఏప్రిల్ మాసంలో తూర్పు, ఈశాన్య భారతంలో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 28.12 డిగ్రీల సెల్సియస్గా నమోదైందని పేర్కొన్నారు. 1901 తర్వాత ఆయా ప్రాంతాల్లో ఏప్రిల్ ఇంత కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి. 1980 నుంచి దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా మారాయన్నారు. దక్షిణ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, గుజరాత్ ప్రాంతాల్లో మేలో 8-11 రోజుల పాటు వేడి తరంగాలు ఉండవచ్చని మహాపాత్ర చెప్పారు. రాజస్థాన్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇంటీరియర్ ఒడిశా, గంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో ఐదు నుంచి ఏడు రోజుల వరకు వడగాలులు వీచే అవకాశాలున్నాయన్నారు.
సాధారణంగా ఉత్తర భారతం, మధ్యభారతం, ద్వీపకల్ప భారత పరిసర ప్రాంతాల్లోని మైదాన ప్రాంతాల్లో దాదాపు మూడురోజుల పాటు వడగాలులుంటాయి. ఏప్రిల్లో ఎండలకు ప్రధాన కారణం ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడమేనని వాతావరణశాఖ పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, భారతదేశానికి ఆనుకుని ఉన్న తూర్పుతీరంలో అల్ప స్థాయిలో ఏర్పడిన తుఫాను వ్యతిరేక పరిస్థితుల కారణంగా తక్కువ వర్షాపాతం నమోదైంది. ఈ వాతావరణ దృగ్విషయం కారణంగా సముద్రం నుంచి వచ్చే గాలులు ఒడిశా, బెంగాల్ వైపు ఎక్కువగా వీయలేదని పేర్కొంది. మే నెలలో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మే నెలలో సాధారణ వర్షపాతం (దీర్ఘకాలిక సగటులో 91-109 శాతం) కురిసే అవకాశం ఉంది.
వాయువ్య భారతదేశం, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ద్వీపకల్పం, ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉన్నది. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కారణంగా ఉత్తర, మధ్య భారతంలో ఉఏప్రిల్ నెలలో వర్షం, వడగళ్లు కురిశాయి. పశ్చిమ బెంగాల్లోని గంగా తీరంలో 15 ఏళ్లలో, ఒడిశాలో తొమ్మిదేళ్ల తర్వాత అత్యధికంగా వేడిగాలులు వీచినట్లుగా మోహపాత్ర పేర్కొన్నారు. దేశంలోని చాలా ప్రాంతాలలో మేలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. అయితే, ఈశాన్య భారతదేశంలోని చాలాప్రాంతాలతో పాటు మధ్య భారతం, ఈశాన్య ద్వీపకల్ప భారతంలోని పరిసర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం, సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని పేర్కొంది.