World Inequality Index | న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. నిత్యం పెరుగుతున్న ధరలు, ఇతర కారణాలతో కోట్ల మంది కూడు, గూడు, గుడ్డ కోసం ఇంకా బతుకు పోరాటం చేస్తుండగా.. మరోవైపు ఇదే సమయంలో సంపన్నులు పోటీపడి మరీ లగ్జరీ లైఫ్ అనుభవించడంతో పాటు విలువైన వస్తువుల కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు ఇటీవల ముంబైలో ప్రారంభమైన యాపిల్ స్టోర్కు పలువురు పోటెత్తడమే ఉదాహరణ. ఈ తరహా ఆర్థిక అంతరాలు దేశానికి ఎంతమాత్రం మంచిది కాదని, దేశాభివృద్ధికి ఆటంకం అని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక అంతరాలు అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఉన్నదని వరల్డ్ ఇన్ఈవ్వాలిటీ ఇండెక్స్-2022 పేర్కొన్నది. భారత్లో దేశ ఆదాయంలో టాప్ 10 శాతం లేదా 1 శాతం సంపన్నుల వద్ద వరుసగా 57 శాతం, 22 శాతం సంపద ఉన్నదనే ఆందోళనకర విషయాన్ని వెల్లడించింది.
ఇటీవల యాపిల్ సంస్థ ముంబైలో తన తొలి రిటైల్ స్టోర్ను ప్రారంభించింది. అక్కడ ఒక్కొక్కటి రూ.లక్ష అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే విలువైన ఫోన్ల కోసం స్టోర్ ముందు సంపన్నులు క్యూ కట్టారు. కాగా, మునుపటి ఏడాది కంటే 2022లో భారత్లో లగ్జరీ కార్ల అమ్మకాలు పెరిగాయి. ఇదే సమయంలో మధ్యతరగతి ప్రజలు వినియోగించే బైక్లు, దేశీయ తయారీ సంస్థ బజాజ్ ఆటో అమ్మకాలు 10 శాతం పడిపోయాయి. భారత్ను తమ వేగవంతమైన మార్కెట్గా భావిస్తున్న లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ అమ్మకాలు గణనీయంగా ఉంటాయని అంచనా వేస్తున్నది. పైన పేర్కొన్న దానికి విరుద్ధంగా దేశంలో 63 శాతం పేద, మధ్య తరగతి వినియోగదారులు అనవసరమైన వస్తువులు, సేవలపై ఖర్చులను పరిమితం చేసుకొంటున్నారని 2023 పీడబ్ల్యూసీ గ్లోబల్ కన్జ్యూమర్ ఇన్సైట్స్ పల్స్ సర్వే పేర్కొన్నది. తమ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులపై ఆందోళన చెందుతున్నామని సర్వేలో పాల్గొన్న 74 శాతం మంది పేర్కొన్నారు.