న్యూఢిల్లీ : మద్యం కుంభకోణంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్పై ఆ పార్టీ నేత అతిషి (AAP) శుక్రవారం స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీలపై ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులతో దాడులు చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ ఒక్క రూపాయి కూడా పట్టుకోకపోయినా ఆయనను బీజేపీ ఈడీ అరెస్ట్ చేసిందని అతిషి దుయ్యబట్టారు.
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఈడీ, సీబీఐ, ఐటీ వెంటాడటం మనం చూస్తున్నామని చెప్పారు. సంజయ్ సింగ్ ఇంట్లో అవినీతి సొమ్ము ఒక్క రూపాయి దొరికినా దానికి సంబంధించిన ఆధారాలను ప్రజల ముందు పెట్టాలని తాను కాషాయ పార్టీకి సవాల్ చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్పై మోదీ సర్కార్ దర్యాప్తు చేస్తున్నదని, 15 నెలలుగా ఈడీ, సీబీఐ 500 మంది అధికారులను మోహరించి విచారణ చేపట్టినా ఒక్క రూపాయి అవినీతిని కూడా బయటపెట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు.
బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం కానీ, విచారణాధికారులు కానీ ఈ స్కామ్లో అవినీతికి సంబంధించిన ఆధారాలను న్యాయస్ధానాలు, దేశ ప్రజల ముందుంచలేకపోయాయని ఢిల్లీ మంత్రి అతిషి అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే దర్యాప్తు సంస్ధ మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్లను అరెస్ట్ చేసిందని ఆమె ఆరోపించారు.
Read More :
Poster War | పోస్టర్ వార్.. రావణుడిగా రాహుల్, అతిపెద్ద అబద్ధాలకోరు మోదీ