Anubhav Mohanty : ఒడిశా రాష్ట్రంలో అధికార బీజేడీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, సీనియర్ నేత అనుభవ్ మొహంతి బీజేడీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్కు పంపించారు.
ఇన్నేళ్లుగా తనకు ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు నవీన్ పట్నాయక్కు, బీజేడీకి మొహంతి కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఇటీవల మరణించడంతో సరిగా పనిచేయలేకపోతున్నానని తెలిపారు.
అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వివరించారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని పేర్కొన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా, నా నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ సేవ చేసుకుంటానని తెలిపారు. ప్రస్తుతం అనుభవ్ మొహంతి కేంద్రపార నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.