హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): దేశంలో తొలిడ్రోన్ దాడి కలకలం సృష్టిస్తున్న సమయంలో హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘గ్రీన్ రోబోటిక్స్’ పరిష్కార మార్గంతో ముందుకొచ్చింది. దేశంలోనే మొట్టమొదటి ‘స్వీయ నియంత్రిత డ్రోన్ విధ్వంసక వ్యవస్థ’ (ఆటానమస్ డ్రోన్ డిఫెన్స్ డోమ్ సిస్టమ్)ను అభివృద్ధి చేసినట్టు ప్రకటించింది. దీనికి ‘ఇంద్రజాల్’ అని నామకరణం చేసింది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని రూపొందించామని తెలిపింది
ముందే గుర్తించి కూల్చేస్తుంది
ఇంద్రజాల్ సుమారు 1,000-2,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంపై నిఘా ఉంచుతుందని ‘గ్రీన్ రోబోటిక్స్’ తెలిపింది. ఆయుధ సహిత డ్రోన్లు, సూసైడ్/బాంబింగ్ డ్రోన్లు, మానవ రహిత విమానాలు (యూఏవీ), రాడార్కు చిక్కని ఆర్సీఆర్ వాహనాలను ‘ఇంద్రజాల్’ ముందే గుర్తించి కూల్చివేస్తుందని వెల్లడించింది. సుమారు ఎనిమిదేండ్లపాటు శ్రమించి, దేశ రక్షణ రంగ అవసరాలను తీర్చేలా ఈ వ్యవస్థను అభివృద్ధి చేశామని పేర్కొన్నది. దీని నిర్మాణంలో 9-10 రకాల టెక్నాలజీలు వాడినట్టు చెప్పింది.
యుద్ధవ్యూహాలే మారిపోతాయి
దేశ పశ్చిమ సరిహద్దులో ఉగ్రవాద సంస్థలు, వాటిని పెంచి పోషించే సైన్యం వద్ద ఇప్పటికే బాంబింగ్ డ్రోన్లు ఉన్నాయని ‘గ్రీన్ రోబోటిక్స్’ కంపెనీ సీఈవో, రిటైర్డ్ వింగ్ కమాండర్ ఎంవీఎన్ సాయి తెలిపారు. ఇలాంటి సమయంలో ఇంద్రజాల్ వంటి వ్యవస్థల అవసరం ఎంతో ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న యాంటీ డ్రోన్ వ్యవస్థలకు అనేక పరిమితులు ఉన్నాయని, ముఖ్యంగా అవి తక్కువ విస్తీర్ణంపై నిఘా పెడుతాయని పేర్కొన్నారు. పశ్చిమ సరిహద్దుపై నిఘా ఉంచాలంటే ప్రస్తుతం ఉన్న యాంటీ యూఏవీ సిస్టమ్స్ను కనీసం 300 మోహరించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇది దేశానికి ఆర్థికంగా భారమని, ఇన్ని వ్యవస్థలను అనుసంధానించడం కష్టమవుతుందని తెలిపారు. అయితే ఇంద్రజాల్ వ్యవస్థలు మాత్రం 6-7 వరకు మాత్రమే సరిపోతాయని చెప్పారు. ఇది ప్రతిక్షణం నిఘా ఉంచుతుందని, దీనిని ఎక్కడికైనా సులభంగా తరలించవచ్చని, పూర్తిగా కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తుందని, ప్రస్తుతం ఉన్న అన్ని రకాల ఆయుధ వ్యవస్థలతో అనుసంధానం అవుతుందని వివరించారు. దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ వ్యవస్థలను వెంటనే సైన్యంలో ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కోరారు. కృత్రిమమేధతో యుద్ధవ్యూహాలే మారిపోతాయని, ఇలాంటి సమయంలో సంప్రదాయ ఆయుధాలు సరిపోవన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఇంద్రజాల్ ఆ లోటును భర్తీ చేస్తుందని ఎంవీఎన్ సాయి చెప్పారు.
జమ్ము, జూన్ 28: భారత్పై మరోసారి డ్రోన్ దాడికి యత్నం జరిగింది. భద్రతా దళాలు సమర్థమంతంగా అడ్డుకొన్నాయి. ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. జమ్ములోని కల్చుక్ ప్రాంతంలో ఉన్న సైనిక స్థావరంపై ఆదివారం అర్ధరాత్రి రెండు డ్రోన్లు అనుమానాస్పదంగా కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన బలగాలు వాటిపైకి 25 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు. రాత్రి 11.45 గంటలు, 2.40 గంటల సమయంలో ఈ డ్రోన్లు కనిపించినట్టు అధికారులు తెలిపారు. జమ్ములో వాయుసేన స్థావరంపై దాడి జరిగిన 24 గంటల్లోనే మరోసారి డ్రోన్లు సైనిక స్థావరం మీదకు రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. 2002లో కూడా ఇదే స్థావరంపై ఉగ్రదాడి జరిగింది. అప్పుడు 10 మంది పిల్లలు సహా 31 మంది చనిపోయారు. కాగా, జమ్ములోని వాయుసేన స్థావరంపై రెండు డ్రోన్లతో దాడి జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఆరు నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు జరిగాయి. ఒక్కో డ్రోన్ 2 కిలోల చొప్పున శక్తిమంతమైన ఐఈడీలను మోసుకొచ్చాయి. జైషే మహ్మద్ ఈ దాడి వెనుక ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
కేంద్ర వైఫల్యం వల్లే: అసదుద్దీన్
జమ్ములో డ్రోన్ దాడులు కేంద్రప్రభుత్వ భద్రతా సంస్థల నిఘా వైఫల్యానికి నిదర్శనమని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ‘దాడుల వెనుక అమెరికా, చైనా హస్తం ఉందంటున్నారు. దీనిపై కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందనే విషయంపై స్ఫష్టత ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని కోరారు. ప్రతీకార దాడులు చేయాలని సూచించారు.