భువనేశ్వర్, సెప్టెంబర్ 6: ఊరంతా విషపూరిత ఎర్రచీమలు వ్యాపిస్తే ఏం చేస్తాం.. ఆ చీమలు కుట్టిన చోట మంటపుట్టి, చర్మంపై వాపు వస్తే.. భయంతో వణికిపోవాల్సిందే! ఇదే పరిస్థితి తలెత్తింది ఒడిశాలోని పూరి జిల్లా చంద్రదేవ్పూర్ పంచాయతీ పరిధిలోని బ్రాహ్మణసాహి గ్రామస్థులకు. చీమలతో పడలేక సమీప గ్రామాల్లోని బంధువులు, స్నేహితుల ఇండ్లకు వెళ్తున్నారు. వరద తగ్గడంతో గ్రామాన్ని లక్షలాది ఎర్రచీమలు చుట్టుముట్టాయి. పెంపుడు జంతువులు, బల్లులు కూడా చీమల బారిన పడ్డాయి. కనీసం ప్రశాంతంగా పడుకొనే, నిలబడే, కూర్చొనే, చదువుకొనే పరిస్థితి కూడా లేదని గ్రామస్థులు వాపోతున్నారు.