Answer Key: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ (JEE Main 2024) తొలి విడత (Session-1) పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ (Answer Key) విడుదలైంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం రాత్రి ఈ కీని విడుదల చేసింది.
ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీలతోపాటు రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. కీపై అభ్యంతరాలు ఉంటే ప్రతి ప్రశ్నకు రూ.200 ఫీజుతో ఈ నెల 8 వరకు ఛాలెంజ్ చేసే వెసులుబాటును కల్పించింది. ఒకవేళ అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలు సరైనవే అయితే.. ఆన్సర్ కీని సవరించి తుది కీ విడుదల చేస్తారు. ఆ తర్వాత తుది ఫలితాలను ప్రకటిస్తారు. కాగా, ఈ పరీక్షకు 12,95,617 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 12,25,529 మంది హాజరయ్యారు.