చండీగఢ్: బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలోని ఒక గ్రామంలో గత ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఏకంగా విద్యుత్ సబ్ స్టేషన్కు తాళం వేశారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోతే ఆ సబ్ స్టేషన్కు నిప్పుపెడతామని హెచ్చరించారు. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హుక్మావాలి గ్రామంలో గత ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రి వేళ గ్రామమంతా గాఢాందకారం నెలకొంటున్నది. దీంతో పిల్లలు, పెద్దలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు.
కాగా, ఐదు రోజులైనా విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరించలేదు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సబ్ స్టేషన్ను ముట్టడించారు. ఆ కార్యాలయం గేట్కు తాళం వేశారు. అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. 24 గంటల విద్యుత్ సరఫరాకు హామీ ఇవ్వడంతో విద్యుత్ శాఖకు 14 ఎకరాల భూమిని పంచాయితీ ఇచ్చిందని తెలిపారు. అయితే గత ఐదారు రోజులుగా విద్యుత్ సరఫరా లేదని ఆరోపించారు. విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సబ్ స్టేషన్కు నిప్పుపెడతామని గ్రామస్తులు హెచ్చరించారు.
మరోవైపు గ్రామస్తుల నిరసనపై విద్యుత్ అధికారులు స్పందించారు. వర్షాల వల్ల ట్రాన్స్ఫార్మర్ పాడైందని తెలిపారు. మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు చేపడతామని చెప్పారు. గ్రామస్తులు శాంతియుతంగా ఉండాలని సూచించారు.