న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాష్ట్రం రిషికేశ్లోని ఓ రిసార్టులో రిసెప్షనిస్ట్ హత్య ఘటన తీవ్ర దుమారం రేపుతున్నది. రిసార్టు ఓనరే మరో ఇద్దరితో కలిసి రిసెప్షనిస్టును హత్య చేసినట్లు తేలింది. రిసార్టు ఓనర్ రాష్ట్ర బీజేపీ నేత కొడుకు కావడంతో ఈ ఘటన దేశమంతటా సంచలనంగా మారింది. ఘటనను సీరియస్గా తీసుకున్న ఉత్తరాఖండ్లోని బీజేపీ సర్కారు నిందితుడిని అరెస్టు చేయించి, శుక్రవారం రాత్రి రిసార్టును ధ్వంసం చేయించింది.
హత్య ఘటనపై ఆగ్రహంతో ఉన్న స్థానికులు శనివారం ఉదయం రిసార్టులోని ఫర్నీచర్కు నిప్పుపెట్టారు. దాంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్మింది. రిషికేశ్కు 10 కిలోమీటర్ల దూరంలోని ఈ రిసార్టు ఉత్తరాఖండ్ సీనియర్ బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యకు చెందినది. రిసార్టులో పనిచేసే యువతి సోమవారం నుంచి కనిపించకుండా పోయింది. ఈ విషయాన్ని బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పుల్కిత్ ఆర్య కూడా ఆమె సోమవారం నుంచి కనిపించడం లేదని చెప్పాడు. కానీ పోలీసుల తదుపరి విచారణలో రిసార్టు ఓనర్ పుల్కితే మరో ఇద్దరితో కలిసి ఆమెను హత్య చేసినట్లు తేలింది. దాంతో పోలీసులు శుక్రవారం హత్య కేసులో పుల్కిత్ను అరెస్ట్ చేసి, మిగతా ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఉదయం రిసార్టు సమీపంలోని ఓ కాలువలో బాధితురాలి మృతదేహం లభ్యమైంది.