బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. బాధిత కుటుంబానికి పరిహారంగా ఇచ్చిన రూ.2 లక్షల నగదును ఆయనపైనే ఒక మహిళ విసిరేసింది. బాగల్కోట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 6న కెరూర్లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. హిందూ యువతిని వేధిస్తున్న యాసిన్ అనే ముస్లిం వ్యక్తితో హిందూ జాగారణ వేదిక కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో యాసిన్ తన అనుచరులతో కలిసి వారిపై దాడి చేశాడు. ఈ ఘటన నేపథ్యంలో హిందూ జాగారణ వేదిక కార్యకర్తలు ముస్లింలపై దాడి చేశారు. వారి ఇళ్లు, షాపులకు నిప్పుపెట్టారు. ఈ హింసాత్మక ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఇరు వర్గాలకు చెందిన 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలు అదుపుతప్పకుండా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ కూడా విధించారు.
కాగా, సీఎల్పీ నేత సిద్ధరామయ్య శుక్రవారం బాగల్కోట్ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. కెరూర్ హింసలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. గాయపడిన నలుగురు కుటుంబ సభ్యులకు రూ.50,000 చొప్పున రూ.2 లక్షల డబ్బును నష్ట పరిహారంగా అందజేశారు.
అనంతరం సిద్ధరామయ్య తన కారులో అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా ముస్లిం మహిళ ఆయన వద్దకు వచ్చింది. మాకు డబ్బులు అక్కర్లేదని సిద్ధరామయ్య ముఖం మీదే చెప్పింది. ఘటన జరిగిన చాలా రోజుల తర్వాత పరామర్శకు రావడంపై మండిపడింది. ఆయన ఇచ్చిన డబ్బులను తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నించింది. సిద్ధరామయ్య తన కారులో అక్కడి నుంచి వెళ్తుండగా ఆయన కాన్వాయ్లోకి డబ్బును విసిరేసింది. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In a high-drama, a #Muslim woman refuses to take Rs 2 Lakh compensation given by opposition leader #Siddaramaiah to those members of the families that suffered injuries during #KerurViolence.#Karnataka #Bagalkote #Badami #Kerur https://t.co/mk3A4fyHyi pic.twitter.com/fITfwgX2xA
— Hate Detector 🔍 (@HateDetectors) July 15, 2022