సివిల్స్ తుది ఫలితాల్లో 50మంది తెలుగు అభ్యర్థులు జాతీయ స్థాయిలో సత్తాచాటారు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన 22 ఏండ్ల దోనూరి అనన్యరెడ్డి మొదటి ప్రయత్నంలోనే ఆలిండియా మూడో ర్యాంకు సాధించారు.
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): సివిల్స్ తుది ఫలితాల్లో తెలంగాణకు చెందిన అనన్యరెడ్డి సత్తాచాటారు. తొలి ప్రయత్నంలోనే అసమాన ప్రతిభ కనబర్చి మూడో ర్యాంకు సాధించారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే పాలమూరు బిడ్డ అనన్య.. ఆలిండియా 3వ ర్యాంకుతో మెరిశారు. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం నిర్వహించిన సివిల్స్ పరీక్షల తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో ఆదిత్య శ్రీవాస్తవ (27) మొదటి ర్యాంకు, అనిమేశ్ ప్రధాన్(24) రెండో ర్యాంకు సాధించారు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన 22 ఏండ్ల అనన్యరెడ్డి మొదటి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించారు.
పీకే సిద్ధార్థ్ రామ్కుమార్(27) నాలుగో ర్యాంకు, రుహాణి(28) ఐదో ర్యాంకు సాధించారు. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్తోపాటు సివిల్ సర్వీసులు, గ్రూప్-ఏ, గ్రూప్ బీ సర్వీసులు కలిపి జాతీయ స్థాయిలో మొత్తం 1,016 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇందులో 664 మంది పురుషులు, 352 మంది మహిళలు ఉన్నారు. టాప్ 25 ర్యాంకర్లలో 10 మంది మహిళలు కాగా 15 మంది పురుషులు ఉన్నారు. ర్యాంకులు సాధించినవారిలో తెలంగాణ రాష్ర్టానికి చెందినవారు 40 మందికిపైగా ఉన్నట్టు తెలిసింది. జాతీయ స్థాయిలో నందల సాయికిరణ్ 27వ ర్యాంకు, మెరుగు కౌశిక్ 82వ ర్యాంకు, ప్రస్తుతం ఢిల్లీలో ఏసీపీగా ఉన్న సిద్దిపేట జిల్లా కొండపాకవాసి బుద్ధి అఖిల్యాదవ్ 321 ర్యాంకు సాధించి ఐఏఎస్కు ఎంపికయ్యారు. సివిల్స్లో మెరిసిన తెలుగు రాష్ర్టాల అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల నుంచి ఈ సారి 50పైగా అభ్యర్థులు సివిల్స్కు ఎంపిక కావడం పట్ల సీఎం ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరు బిడ్డ దోనూరి అనన్యరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
సివిల్స్ ఫలితాల్లో మొదటి ఐదు ర్యాంకులు సాధించిన వారిలో ముగ్గురు 2022లోనూ సివిల్స్లో ఉత్తీర్ణులయ్యారు. 2022 సివిల్స్ పరీక్షలో ఆదిత్య శ్రీవాస్తవ 236వ ర్యాంకు, పీకే సిద్ధార్థ్ రామ్కుమార్ 121వ ర్యాంకు, రుహాణి 159వ ర్యాంకు సాధించారు. ఈ ముగ్గురు గత ఏడాదే ఐపీఎస్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష గత ఏడాది మే 28న జరిగింది. ఈ పరీక్షకు 10,16,850 మంది దరఖాస్తు చేసుకోగా 5,92,141 మంది హాజరయ్యారు. వీరిలో 14,624 మంది మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన మెయిన్ పరీక్షలో 2,855 మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. వీరిలో 1,016 మంది తుది ఫలితాల్లో ఉత్తీర్ణులయ్యారు. 347 మంది జనరల్ క్యాటగిరీలో, 115 మంది ఆర్థికంగా వెనుకబడినవర్గాల (ఈడబ్ల్యూఎస్) క్యాటగిరీలో, 303 మంది ఓబీసీ, 165 మంది ఎస్సీ, 86 మంది ఎస్టీ క్యాటగిరీల నుంచి ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను http:// www.upsc.gov.in వెబ్సైట్లో యూపీఎస్సీ అందుబాటులో ఉంచింది. 15 రోజుల్లోగా మార్కుల వివరాలను కూడా వెబ్సైట్లో పొందుపరుస్తామని ప్రకటించింది.
సివిల్స్ ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించిన ఆదిత్య శ్రీవాస్తవ స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. ఆయన తండ్రి అజయ్ శ్రీవాస్తవ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా పని చేస్తున్నారు. చిన్ననాటి నుంచి చదువుల్లో ముందుండే ఆదిత్య 12వ తరగతిలో 95 శాతం మార్కులు సాధించారు. ఐఐటీ కాన్పూర్ నుంచి బీటెక్, ఎంటెక్ పూర్తి చేశారు. 2019లో ఆయన బెంగళూరులోని గోల్డ్మెన్ శాక్స్లో ఉద్యోగం సాధించారు. 15 నెలలపాటు కార్పొరెట్ విధులు నిర్వర్తించి, లక్షల్లో వేతనం అందుకున్న తర్వాత ఆయన సివిల్స్పై ఆసక్తితో ఉద్యోగాన్ని వదులుకొని ఇటు వైపు అడుగులు వేశారు. 2022లోనూ ఆయన సివిల్స్లో 236వ ర్యాంకు సాధించి ఐపీఎస్గా ఎంపికయ్యారు. చదువు పూర్తయ్యాక ఆర్థిక భద్రత సాధించాలనే ఆలోచనతో కార్పొరేట్ ఉద్యోగంలో చేరానని, అయితే డబ్బు మాత్రమే అంతిమ ప్రేరణ కాదని గ్రహించి సివిల్ సర్వీసెస్కు సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నట్టు ఆదిత్య తన మాక్ ఇంటర్వ్యూలో తెలిపారు. అట్టడుగు స్థాయిలో ప్రభావం చూపడానికి, వ్యవస్థకు తనవంతు సహకారాన్ని అందించడానికి ఇది ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.
గతేడాది సివిల్స్లో ఐపీఎస్ వచ్చినా చేరకుండా ఈ ఏడాది ఐఏఎస్ సాధించానని ఢిల్లీకి చెందిన అయాన్ జైన్ తెలిపారు. మంగళవారం యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్-2023 ఫలితాల్లో ఆల్ ఇండియా 16వ ర్యాంక్ సాధించిన అయాన్ ఫోన్లో ‘నమస్తే ప్రతినిధి’తో మాట్లాడారు. ఢిల్లీలోనే విద్యాభ్యాసమంతా పూర్తి చేసినట్టు అయాన్ చెప్పారు. ఐఐటీ ఢిల్లీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి మూడో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించానని తెలిపారు. రెండో ప్రయత్నంలో ఐపీఎస్ వచ్చినప్పటికీ ఐఏఎస్ వైపే దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. మ్యాథ్స్ ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకొని సివిల్స్లో ర్యాంకు పొందానని చెప్పారు. సివిల్స్ రాయాలనుకొనే వారు మొదట పరీక్షను విశ్లేషించుకోవాలని, తర్వాత అవగాహన ఏర్పర్చుకుని ప్రిపరేషన్ కొనసాగిస్తే విజయం సాధించవచ్చని ఆయన సూచించారు.
క్రమసంఖ్య పేరు ఆలిండియా ర్యాంకు