శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా కొకెర్నాగ్ ఏరియాలో కాల్పుల మోత మోగుతూనే ఉంది. నాలుగు రోజులుగా భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. కొకెర్నాగ్ ఏరియాలోని గారోల్ ఫారెస్ట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టారు.
ఈ సందర్భంగా అడవిలో దాగి ఉన్న ఉగ్రవాదులు దొంగదెబ్బ కొట్టారు. భద్రతా బలగాలపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో అధికారి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. మృతుల్లో కల్నల్ మన్ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోన్చాక్, జమ్ముకశ్మీర్ పోలీస్ డీఎస్పీ హుమాయున్ ముజామిల్ ఉన్నారు. శుక్రవారం మరణించిన సైనికుడి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, నలుగురు అధికారుల మరణంతో సైన్యం ఆ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ప్రతీకార దాడులు చేస్తున్నది. డ్రోన్లతో దాడులను కొనసాగిస్తున్నది. అడవిలో ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు దాగి ఉన్నట్టు తమకు విశ్వసనీయ సమాచారం ఉన్నదని, తాము వాళ్లున్న ఏరియాను చుట్టుముట్టామని, ఎట్టి పరిస్థితుల్లో వాళ్లందరినీ మట్టుబెడుతామని జమ్ముకశ్మీర్ ఏడీజీ విజయ్ కుమార్ చెప్పారు. దీనిపై రిటైర్డ్ ఆర్మీ అధికారులు మీడియాతో ఇష్టారీతిన మాట్లాడవద్దని కోరారు.