న్యూఢిల్లీ : సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో సమాచారం అనేక విధాలుగా చేరుతోంది. సగటు భారతీయుడిని రోజుకు కనీసం 12 నకిలీ మెసేజ్లు వేధిస్తున్నాయి. ఈ-మెయిల్, టెక్స్, సామాజిక మాధ్యమాల ద్వారా వస్తున్న ఈ ఫేక్ మెసేజ్లను చదివి, నిర్ణయం తీసుకోవడానికి ఒక్కొక్కరు వారానికి కనీసం 1.8 గంటలు ఖర్చు చేస్తున్నారు. మెక్ఎఫీ నిర్వహించిన ‘గ్లోబల్ స్కామ్ మెసేజ్’ అధ్యయనంలో పాల్గొన్న భారతీయుల్లో 82 శాతం మంది ఫేక్ మెసేజ్లపై క్లిక్ చేసినట్లు తెలిపారు. మెసేజ్లు నమ్మదగినవిగానే కనిపిస్తాయని, స్పెల్లింగ్ మిస్టేక్స్ వంటివేవీ ఉండవని 49 శాతం మంది చెప్పారు. ఫేక్ జాబ్ నోటిఫికేషన్స్ బారినపడ్డామని 64 శాతం మంది చెప్పగా, బ్యాంక్ అలెర్ట్ మెసేజెస్ బుట్టలో పడ్డామని 52 శాతం మంది తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ) వల్ల స్కామ్లు కూడా ఆధునికతను సంతరించుకోవడంతో, ప్రపంచంలోని వినియోగదారులపై ఎలా ఉందో ఈ అధ్యయనంలో పరిశీలించారు. భారత్ సహా మొత్తం ఏడు దేశాల్లో ఈ అధ్యయనం జరిగింది.