గౌహతి: భారతీయ వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 ట్రాన్స్పోర్ట్ విమానం(AN-32 Transport Aircraft) ఇవాళ కూలింది. అస్సాంలోని జోర్హాట్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. విమానం కూలిన తర్వాత మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఎమర్జెన్సీ బృందాలు చేరుకున్నాయి. మంటల్ని అదుపు చేస్తున్నారు. అయితే దేని వల్ల ప్రమాదం జరిగిందో ఇంకా తెలియడం లేదు. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా లేదా అన్న సమాచారం కూడా లేదు. ఈ ఘటనకు చెందిన పరిస్థితిపై త్వరలో అప్డేట్స్ ఇవ్వనున్నట్లు భారతీయ వైమానిక దళం చెప్పింది.
AN32 crashes during landing at Jorhat
Details awaited
However, in the landing accidents that I have seen of AN32, people have always walked away
I hope it’s the same case here too pic.twitter.com/0HeAUFoy81— Dr MJ Augustine Vinod 🇮🇳 (@mjavinod) June 13, 2026
ఆంటనోవ్ ఏఎన్-32 ట్విన్ ఇంజిన్ టర్బో మిలిటరీ ట్రాన్స్పోర్టు విమానం. భారతీయ వైమానిక దళంలో వర్క్హార్స్గా దీన్ని గుర్తిస్తారు. సోవియేట్ యూనియన్ ఈ విమానాన్ని తొలుత నిర్మించింది. భారతీయ అవసరాలకు తగినట్లు దీన్ని తీర్చిదిద్దారు. భారతీయ వైమానిక దళంలో సుమారు వంద వరకు ఏఎన్-32 ట్రాన్స్పోర్టు విమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. అతి క్లిష్టమైన వాతావరణంలోనూ ఏఎన్-32 మెరుగైన రీతిలో పనిచేస్తుంది. హై ఆల్టిట్యూడ్ ఎయిర్ఫీల్డ్స్లో ఫంక్షన్ చేస్తున్నది. వేడి వాతావరణాల్లోనూ ఏఎన్-32 చురుకుగా ఉంటుంది. సుమారు 7.5 టన్నుల కార్గోను ఇది మోసుకెళ్లగలదు. 50 మంది ప్రయాణికులు లేదా 42 మంది పారాట్రూపర్లను కూడా తీసుకెళ్లగలదు. రిమోట్ ప్రాంతాలకు ఆహార సరఫరా కోసం వీటిని ఎక్కువగా వాడుతుంటారు.
ఇటీవలే భారతీయ వైమానిక దళానికి చెందిన సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో కూలిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మృతిచెందారు. మార్చి 5వ తేదీన ట్విన్ సీటర్ విమానం.. జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే గ్రౌండ్ కంట్రోల్ నుంచి కమ్యూనికేషన్ మిస్సైంది. అయితే కర్బీ జిల్లాలో ఉన్న కొండ ప్రాంతాల్లో ఆ యుద్ధ విమానం కూలినట్లు గుర్తించారు.