నాగపూర్/న్యూఢిల్లీ, జూలై 2: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశంలో వరుస హత్యలకు దారితీస్తున్నాయి. నూపుర్ను సమర్థిస్తూ పోస్టు పెట్టినందుకు ఇప్పటికే ఉదయ్పూర్లో ఓ టైలర్ను దుండగులు పాశవికంగా హత్య చేసిన ఘటనను మరువక ముందే ఇలాంటిదే మరో దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని అమరావతి పట్టణానికి చెందిన 54 ఏండ్ల ఓ కెమిస్టును కొందరు దుండగులు జూన్ 21న హత్య చేశారు. కత్తితో మెడపై దాడి చేసి కిరాతకంగా చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేసినట్టు నగర పోలీసు కమిషనర్ ఆర్తి సింగ్ శనివారం పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ఖాన్ కోసం వెదుకుతున్నట్టు చెప్పారు. నూపుర శర్మకు మద్దతుగా వాట్సాప్ గ్రూపులో ఓ పోస్టును షేర్ చేయడమే ఈ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తుందని కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి ట్విట్టర్లో వెల్లడించారు. ఇప్పటికే పట్టణానికి చేరుకున్న ఎన్ఐఏ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
రూ. 10 వేల సుపారీ
ఉమేశ్ ప్రహ్లాద్రావ్ కొల్హే అనే వ్యక్తి అమరావతి పట్టణంలో మెడికల్ స్టోర్ నడుపుకుంటున్నారు. కొంతమంది ముస్లింలు సభ్యులుగా ఉన్న ఒక వాట్సాప్ గ్రూపులో ఆయన మెంబర్గా ఉన్నారు. ప్రవక్తపై నూపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతు ప్రకటిస్తూ ఆ గ్రూప్లో ఇటీవల ఉమేశ్ ఓ పోస్టు షేర్ చేశాడని కొట్వాలి పోలీసుస్టేషన్ అధికారి పేర్కొన్నారు. ఇది జరిగిన తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితుడైన, స్థానికంగా ఒక ఎన్జీవో నడుపుకునే ఇర్ఫాన్ఖాన్.. ఉమేశ్ను హత్య చేయాలని కుట్ర పన్నాడని, ఇందుకు ఐదుగురు వ్యక్తులకు రూ.10 వేల సుపారీ ఇవ్వడంతో పాటు కారులో సురక్షితంగా తప్పించుకునేలా చేస్తానని హామీ ఇచ్చాడని తెలిపారు. ఈ క్రమంలో గత నెల 21న రాత్రి 10 గంటల సమయంలో దుకాణం మూసేసి వెళ్తుండగా, రెండు మోటర్ సైకిళ్లపై వచ్చిన వ్యక్తులు ఉమేశ్ను అడ్డగించారు. అనంతరం దుండగుల్లో ఒక వ్యక్తి బండిపై నుంచి దిగి ఉమేశ్ మెడపై ఓ పదునైన కత్తితో పొడిచి అక్కడ నుంచి పరారయ్యారు. ఆ వెనుకనే వస్తున్న కుమారుడు సాకేత్.. ఉమేశ్ను దవాఖానకు తరలించగా, అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు చెప్పారని వివరించారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. వీరంతా రోజువారీ కూలీలని తెలిపారు.
బెదిరింపులు వస్తున్నాయ్..
నూపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టినప్పటి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంటూ ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాకి చెందిన రాజా జగత్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంపేస్తామంటూ రెండు ఫోన్ నంబర్ల నుంచి బెదిరించారని అందులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి విశ్వాస్ చంద్రకర్ తెలిపారు.