బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంటికి కేంద్ర హోంమంత్రి అమిత్షా వెళ్తున్నారు. అక్కడే విందు కూడా చేయనున్నారు. అమిత్షా కోసం గంగూలీ పూర్తి శాకాహారంతో ఉన్న వంటకాలనే తయారు చేయించారు. బెంగాల్ పర్యటన సందర్భంగా తన ఇంటికి రావాలని తాను ఆహ్వానించానని, అందుకు షా అంగీకరించారని గంగూలీ పేర్కొన్నారు. షాతో తనకు 2008 నుంచే పరిచయం ఉందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
అమిత్షా గంగూలీ ఇంటికి వెళ్తున్నారన్న వార్తలు బయటికి పొక్కగానే ఒక్కసారిగా బెంగాల్ రాజకీయం మారిపోయింది. దాదా బీజేపీలో చేరుతున్నారని, అందుకే అమిత్షా ఆయనతో భేటీ అవుతున్నారన్న ప్రచారం విపరీతంగా జరుగుతోంది. వాస్తవానికి ఈ ప్రచారం చాలా రోజులుగా నడుస్తూనే వుంది.
వాస్తవానికి 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనే ఈ వార్త మరింత చక్కర్లు కొట్టింది. గంగూలీ బీజేపీలో చేరేందుకు సర్వం సిద్ధమైందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని వార్తలు కూడా వచ్చాయి. కానీ.. ఏం జరిగిందో కానీ.. చివరికి గంగూలీ బీజేపీలో చేరడం లేదని ప్రకటించి, ఆ పార్టీకి షాకిచ్చారు. మళ్లీ బీజేపీకి షాకిస్తారా? లేదా బీజేపీ కండువా కప్పుకుంటారా? అన్నది మాత్రం ఇప్పటికి సస్పెన్స్.