న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రులు (Delhi ministers Protest) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అధికార నివాసం వద్ద శుక్రవారం బైఠాయించారు. మంత్రులు సౌరభ్ భరద్వాజ్, అతిషి, కైలాష్ గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్ ఆప్ కేబినెట్ తరుఫున నిరసన తెలిపారు. కార్యనిర్వాహక అధికారంపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పునకు కట్టుబడాలని డిమాండ్ చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడంలో చేస్తున్న జాప్యాన్ని ప్రశ్నించారు. సమావేశం కోసం రమ్మని పిలిచిన ఎల్జీ సుమారు 90 నిమిషాలపాటు వేచి ఉంచారని ఆప్ మంత్రులు ఆరోపించారు. ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
కాగా, మిగతా రాష్ట్రాల మాదిరిగానే ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల స్పష్టం చేసింది. పోలీస్, పబ్లిక్ ఆర్డర్, ల్యాండ్ తప్పించి మిగతా అన్ని శాఖలు ఢిల్లీ ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయని తెలిపింది. ప్రభుత్వ అధికారుల నియామకాలు, వారిపై నియంత్రణ కూడా ఎన్నికైన ప్రభుత్వానికే అధికారం ఉంటుందని తీర్పు ఇచ్చింది.
మరోవైపు ఈ తీర్పు నేపథ్యంలో విధులకు అడ్డంకిగా ఉన్న సేవల కార్యదర్శి ఆశిష్ మోర్ను ఢిల్లీ ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే ఆ పోస్ట్ను వీడని ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో ఆ అధికారి బదిలీని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అలాగే ఆశిష్ మోర్ బదిలీకి సంబంధించిన ఫైల్ను క్లియర్ చేయాలని సేవల విభాగం మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఎల్జీని కోరారు. ఈ ఆలస్యం వల్ల పరిపాలనకు సంబంధించిన చాలా మార్పులు ఆగిపోయాయని తెలిపారు. రెండు రోజుల కిందట పంపిన ఫైల్పై ఎల్జీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆప్ మంత్రులు ఆయన నివాసం వద్ద భైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు.