ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు మరోసారి పలు మలుపులు తిరుగుతున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ ఆ పార్టీలో తిరుగుబాటు చేశారు. ఆదివారం అనూహ్యంగా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు ఈ పరిణామాలు షాక్ ఇచ్చాయి. ఈ సంఘటన నేపథ్యంలో ముంబైలో ఊహించని రీతిలో పోస్టర్లు వెలిశాయి. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చేతులు కలపాలని అందులో కోరారు. దాదర్ వెస్ట్లోని రామ్ గణేష్ గడ్కరీ చౌక్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వెలుపల ఇది కనిపించింది.
కాగా, ఎంఎన్ఎస్ నాయకుడు లక్ష్మణ్ పాటిల్ ఈ పోస్టర్ను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర రాజకీయాలు బురదమయంగా మారాయని విమర్శించారు. ఈ తరుణంలో ‘రాజ్ సాహెబ్, ఉద్ధవ్ సాహెబ్ ఇప్పుడు కలిసిరావాలి. మహారాష్ట్ర మొత్తం మీ కోసం ఎదురుచూస్తోంది, ముకుళిత హస్తాలతో ఒక మహారాష్ట్ర సైనికుడి హృదయపూర్వక అభ్యర్థన’ అని ఆ పోస్టర్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ఠాక్రే కుటుంబానికి చెందిన రాజ్ ఠాక్రే ఒకప్పుడు శివసేనలో కీలకంగా ఉన్నారు. బాల్ ఠాక్రే వారసుడు ఆయనే అన్న ప్రచారం కూడా సాగింది. అయితే 2005లో శివసేనను ఆయన వీడారు. అనంతరం 2006లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. శివసేనను వీడటానికి ఉద్ధవ్ ఠాక్రే ఆయన వర్గం కారణమని ఆరోపించారు. అలాగే తనను కేవలం ప్రచారం కోసం వినియోగించుకున్నారని విమర్శించారు.
కాగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఆదివారం తీసుకున్న అనూహ్య నిర్ణయంపై రాజ్ ఠాక్రే స్పందించారు. తొలుత శివసేనలో, తాజాగా ఎన్సీపీలో తిరుగుబాటు, చీలిక వంటి రాజకీయ పరిణామాలపై ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ‘మహారాష్ట్ర రాజకీయాల బురద దేశం ముందు ఉన్నది’ అని విమర్శించారు. అలాగే ‘మహారాష్ట్రలోని మిగిలిన ప్రజలు స్వార్థపరులని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి, అధికార పీఠం కోసం ఈ ఆటలన్నీ ఇలాగే కొనసాగుతాయా? లేదా జుగుప్సాకరమైన ఈ అధికార రాజకీయాలకు రాబోయే ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు అడ్డుకట్ట వేస్తారా?’ అని మరాఠీలో చేసిన ట్వీట్లో ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే చేతులు కలపాలంటూ ఎంఎన్ఎస్ నేత ఒకరు ఈ పోస్టర్ ఏర్పాటు చేశారు.
#WATCH | MNS workers put up posters in Mumbai calling for MNS chief Raj Thackeray and Uddhav Thackeray to unite amidst the political situation in Maharashtra.
(Source: MNS) pic.twitter.com/1Mx9IkVz0K
— ANI (@ANI) July 3, 2023