న్యూఢిల్లీ: ఆన్లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీసులను నుంచి తప్పుకుంటున్నది. వచ్చే నెల 29 నుంచి సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే భాగస్వామ్య రెస్టారెంట్లకు సమాచారం అందించింది. కరోనా పీక్ స్టేజ్లో ఉన్నసమయంలో 2020, మే నెలలో అమెజాన్ భారత్లో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. మొదట బెంగళూరులో ఆరంభమైన ఈ సర్వీస్ను.. క్రమంగా మరికొన్ని ప్రాంతాలకు విస్తరించింది. అయితే విస్తృతంగా ప్రచారం చేయకపోవడం, ప్రత్యేకంగా ఒక యాప్ లేకపోవడంతో వినియోగదారులను అంతగా ఆకర్షించలేకపోయింది. దీనికితోడు అప్పటికే ఫుడ్ డెలివరీ విభాగంలో జొమాటో, స్విగ్గీలు దేశీయ మార్కెట్లో స్థిరపడిపోయాయి. దీంతో ఈ రంగంలో ఆశించినంతగా అమెజన్ రాణించలేకపోయింది. దీంతో ఈ సర్వీసులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించామని అమెజన్ వెల్లడించింది.
ఫుడ్డెలివరీతోపాటు నిత్యావసరాల హోమ్ డెలివరీ సర్వీసును కూడా అమెజాన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఫుడ్ డెలివరీ సేవలను నిలిపివేస్తుండగా, నిత్యావసరాల సర్వీసును ఎన్నిరోజులు కొనసాగిస్తుందో చూడాల్సిందే. ఎందుకంటే బిగ్బాస్కెట్, డన్జో, స్విగ్గీ, జొమాటోలు ఈ రంగంలో పాతుకుపోయాయి. నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా ఎడ్-టెక్ బిజినెస్ను మూసివేస్తున్నట్లు గతంలోనే ప్రకటించింది. దీంతోపాటు మరో 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.