న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మోదీ సర్కార్ ప్రఖ్యాత ఆన్లైన్ రిటైల్ కంపెనీ అమెజాన్తో చేతులు కలిపింది. భారత ప్రభుత్వ అనుకూల వైఖరి కలిగిన కంటెంట్ను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు కేంద్ర సమాచారశాఖ, అమెజాన్ మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పుస్తకాలు, జర్నల్స్, ఇతర ప్రచురణలు, వీడియోల్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు అమెజాన్ ఇండియా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనుంది. ప్రభుత్వ టీవీ స్టూడియోల్లో నిర్మాణం జరుపుకున్న సినిమాలు, టీవీ షోలను అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రసారం చేయనుంది.
ప్రభుత్వ ఫిలిం ఇన్స్టిట్యూట్స్లో శిక్షణ పొందిన విద్యార్థులతో కార్యక్రమాలు రూపొందించి, సార్వత్రిక ఎన్నికల వేళ బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు అమెజాన్ ప్రత్యేక కార్యక్రమాల్ని ప్రారంభించనున్నది. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఈ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీ సర్కార్కు లబ్ధిచేకూరేలా అమెజాన్ ప్రైమ్ వీడియో సేవలు ఉండబోతున్నాయని, ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలుంటాయని సమాచారం.