న్యూఢిల్లీ : అమర్నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. కొవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు యాత్ర రద్దయ్యింది. ఈ ఏడాది జూన్ 30న యాత్ర ప్రారంభం కానుండగా.. దేశంలో కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో భక్తులను అనుమతించేందుకు దేవస్థానం బోర్డు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ ఏడాది జమ్మూకశ్మీర్ ప్రభుత్వం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) వ్యవస్థను ప్రవేశపెట్టనున్నది. యాత్రికుల కదలికలను ట్రాక్ చేయనుండగా.. యాత్రికుల భద్రత కోసం వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
అయితే, అమర్నాథ్ యాత్ర కోసం దేవస్థానం బోర్డు (SASB) వెబ్సైట్తో పాటు దేశవ్యాప్తంగా 566 చోట్ల పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈ సందర్భంగా దేవస్థానం బోర్డ్ మార్గదర్శకాలను జారీ చేసింది. 13 సంవత్సరాల కంటే తక్కువ, 75 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారు రిజిస్ట్రేషన్కు అర్హులు కాదని పేర్కొంది. ఆరు వారాలు దాటిన గర్భిణులకు సైతం అవకాశం లేదని పేర్కొంది. రిజిస్ట్రేషన్ కోసం shriamarnathjishrine.com వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. ఆ తర్వాత ‘రిజిస్ట్రేషన్ ఆన్లైన్’పై క్లిక్ చేస్తే కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుందని.
ఇందులో రిజిస్టర్ క్లిక్ చేసి.. అవసరమైన అన్ని వివరాలు ఇవ్వాలని సూచించింది. ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 316 బ్రాంచ్లలో అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభమైందని జమ్మూ సర్కిల్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ యతీందర్ కుమార్ పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు ఎస్ఏఎస్బీ సూచించిన ఆసుపత్రిల నుంచి తప్పనిసరిగా ధ్రువీకరణపత్రం, నాలుగు ఫొటోలతో పాటు రూ.120 ఫీజు చెల్లించాలన్నారు. జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్, ఎస్ బ్యాంక్తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన పలు బ్రాంచ్ల్లోనూ రిజిస్ట్రేషన్కు అవకాశం ఉందని అ ధికారులు పేర్కొన్నారు.