శ్రీనగర్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో పవిత్ర అమర్నాథ్ యాత్ర రిజిష్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు (ఎస్ఐఎస్బీ) ఈ మేరకు గురువారం ప్రకటించింది. “దేశంలో కరోనా పరిస్థితి నేపథ్యంలో అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, శ్రీ అమర్నాథ్జీ యాత్రకు రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపివేశాం. కరోనా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. పరిస్థితి మెరుగుపడిన తర్వాత తిరిగి యాత్ర రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తాం” అని తెలిపింది.
దక్షిణ కశ్మీర్ హిమాయాల్లోని అమర్నాథ్ గుహకు భక్తులు వెళ్లేందుకు ప్రతి ఏటా గట్టి భద్రత మధ్య యాత్ర నిర్వహిస్తారు. బాల్తాల్ మార్గంలో జూన్ 28న, చందన్వారీ మార్గంలో ఆగస్ట్ 22న ప్రారంభమమ్యే యాత్ర కోసం ఈ నెల 1, 15 తేదీల నుంచిపేర్ల నమోదును ప్రారంభించారు. 37 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 446 బ్యాంక్ బ్రాంచ్లలో అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్కు చెందిన 316 బ్రాంచ్లు, జమ్మూ కశ్మీర్ బ్యాంక్కు చెందిన 90 బ్రాంచ్లు, యస్ బ్యాంక్కు చెందిన 40 బ్రాంచుల ద్వారా భక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.
అయితే దేశంలో కరోనా కేసుల ఉధ్రుతి నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు బోర్డు తెలిపింది. ఆన్లైన్ నమోదు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో అన్నది త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది.