కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ అధిష్ఠానంపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వ్యంగ్యంగా స్పందించారు. ఎవరి కర్మ వారు అనుభవించాల్సిందే. ఎవరి కర్మకు వారే బాధ్యులు. ఆల్ ది బెస్ట్ అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు అమరీందర్ సింగ్.
హరీశ్ రావత్ బుధవారం ఒక్కసారిగా పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే తనను ఈదమంటున్నారో… వారే తన కాళ్లు, చేతులు కట్టిపారేశారని అధిష్ఠానంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన విషయంలో పార్టీ తీవ్ర వివక్షతను చూపుతోందని మండిపడ్డారు. ”చూడండి.. ఎంత చిత్రమో.. ఎన్నికలన్న సముద్రంలో ఈదమన్నారు. ఈదడానికి తగిన మద్దతివ్వాల్సింది పోయి… వెన్నుపోటు పొడుస్తోంది సంస్థ. నాకు వ్యతిరేకంగా పాత్ర పోషించడానికి సిద్ధపడిపోయింది. ఈత కొట్టమని దించేశారు. దాంతో పాటు కొన్ని మొసళ్లను కూడా జారవిడిచారు. కాళ్లు, చేతులు కట్టేసి ఈత కొట్టమంటున్నారు. అలిసిపోయా.. ఇక చాలనిపిస్తోంది. విశ్రాంతి తీసుకోవాలనిపిస్తోంది. కొత్త సంవత్సరం ఓ దారిని చూపిస్తుందని ఆశాభావంతోనే ఉన్నా. కేదారేశ్వరుడు ఓ కొత్త మార్గాన్ని చూపిస్తాడని విశ్వాసంతోనే ఉన్నా” అంటూ హరీశ్ రావత్ ట్వీట్ చేశారు.