షిమ్లా: భున్తర్ విమానాశ్రయం సమీపంలో కులు జిల్లా పోలీస్ సిబ్బంది, హిమాచల్ప్రదేశ్ సీఎం భద్రతా సిబ్బందికి మధ్య బుధవారం తీవ్ర వాగ్వాదం జరిగి, చివరకు ఒకరికి ఒకరు కొట్టుకుని తన్నుకునే వరకు చేరింది. సీఎం జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల పర్యటన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు షిమ్లాలోని పోలీస్ ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
వివరాల్లోకి వెళ్తే.. ఫోర్ లేన్ ప్రభావిట్ కిసాన్ సంఘ్ సభ్యులు సీఎం పర్యటన సందర్భంగా విమానాశ్రయం బయట గుమికూడారు. ఈ విషయమై సీఎం భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తంచేశారు. కులు ఎస్పీ గౌరవ్ సింగ్ను నిలదీశారు. దాంతో సహననం కోల్పోయిన గౌరవ్ సింగ్ సీఎం భద్రతా సిబ్బందిలోని అదనపు ఎస్పీ స్థాయి అధికారి బ్రిజేష్ సూద్ను చెంపదెబ్బ కొట్టాడు. దాంతో సీఎం పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (పీఎస్ఓ) బల్వంత్ సింగ్.. గౌరవ్సింగ్ను కాలితో తన్నాడు.
Altercation between Kullu SP and Himachal CM's security personnel during Gadkari's visit to Kullu.
— Sidharth Shukla (@sidhshuk) June 24, 2021
DGP Sanjay Kundu said Kullu SP Gaurav Singh had been transferred to Range Office Mandi.#HimachalPradesh #himachal #bjp #HPgovt #shimla #kullu pic.twitter.com/Qc8F5PEnaz
కాగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. సంఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు అధికారులను విచారణ ముగిసే వరకు సెలవుపై పంపినట్లు రాష్ట్ర డీజీపీ సంజయ్ కుందు తెలిపారు. ప్రస్తుతం కులు ఎస్పీ బాధ్యతను డీఐజీ (సెంట్రల్ రేంజ్) మధుసూదన్ చూసుకుంటారని చెప్పారు. అలాగే బ్రిజేష్ సూద్ స్థానంలో పండోహ్ 3వ బెటాలియన్ చెందిన ఏఎస్పీ పునీత్ రఘును నియమించినట్లు తెలిపారు.