పనాజీ: తెహల్కా.కామ్ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్పై లైంగిక వేధింపుల కేసులో విచారణ మళ్లీ వాయిదాపడింది. కేసులో ఇవాళ విచారణ జరుగాల్సి ఉండగా గోవాలోని మపుసా కోర్టు అదనపు సెషన్స్ జడ్జి మే 21కి విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తౌటే తుఫాన్ కారణంగా కోర్టులో గత రెండుమూడు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే విచారణ వాయిదాకు కారణమని కోర్టు వర్గాలు చెబుతున్నాయి.
కాగా, 2013లో జరిగిన థింక్ ఇన్ గోవా సమావేశంలో తరుణ్ తేజ్పాల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాటంటూ తెహల్కా.కామ్కే చెందిన ఓ మహిళా జర్నలిస్టు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు తరుణ్ తేజ్పాల్పై కేసు నమోదు చేసిన గోవా పోలీసులు 2013 నవంబర్ 30న ఆయనను అరెస్ట్ చేశారు. గోవా కోర్టు ఈ కేసు విచారణ చేపట్టింది. అయితే, తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలను కొట్టివేయాలని తేజ్పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా బెయిల్ పిటిషన్ కూడా వేశారు.
దాంతో 2014 జూలై 1 సుప్రీంకోర్టు తేజ్పాల్కు బెయల్ మంజూరు చేసింది. కానీ, లైంగిక వేధింపుల ఆరోపణలు కొట్టివేయాలన్న పిటిషన్ను మాత్రం పెండింగ్లో పెట్టింది. దాంతో గోవా కోర్టులో కేసు విచారణ ఆలస్యమైంది. అయితే 2019లో తనపై ఆరోపణలను రద్దు చేయాలన్న తరుణ్ తేజ్పాల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో మళ్లీ గోవా కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్నది.