Love | లక్నో : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్ వికృత చర్యకు పాల్పడ్డాడు. తనను ప్రేమించాలని పీజీ చదవుతున్న ఓ విద్యార్థినిని వేధింపులకు గురి చేశాడు. అంతటితో ఆగకుండా ఇంటికి పిలిపించుకుని బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. అతని వేధింపులు భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. అలహాబాద్ యూనివర్సిటీలో గతేడాది ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్(31) నియామకం అయ్యాడు. అయితే అక్కడ చదువుతున్న ఓ పీజీ విద్యార్థినిపై ప్రొఫెసర్ కన్నేశాడు. అప్పట్నుంచి ఆమెకు ఫోన్లు చేస్తూ, తనను ప్రేమించాలని వేధింపులకు గురి చేశాడు. ప్రొఫెసర్ ప్రతిపాదనను విద్యార్థినిని తిరస్కరించింది. చివరకు అతని ఫోన్ నంబర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టింది. కానీ ఇతరుల ఫోన్ల నుంచి ఆమెకు తరుచూ కాల్స్ చేస్తూ మరింత వేధించాడు. దీంతో ప్రొఫెసర్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచారణ అనంతరం ప్రొఫెసర్పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
అయితే ఒకసారి విద్యార్థినిని ప్రొఫెసర్ తన ఇంటికి తీసుకెళ్లాడు. తన ప్రేమను అంగీకరించాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. లైంగిక వేధింపులకు గురి చేసినట్లు బాధితురాలు తెలిపారు. దీంతో తన ఆరోగ్యం విషమించడంతో ఆ రాత్రంతా అక్కడే ఉండిపోయినట్లు ఆమె చెప్పారు. మరుసటి రోజు ఉదయం బయటకు వస్తుంటే, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు గురి చేసినట్లు బాధితురాలు పేర్కొన్నారు.