న్యూఢిల్లీ, మార్చి 28: వివాహితుల సహజీవనంపై కొన్ని రోజుల వ్యవధిలోనే అలహాబాద్ హైకోర్టు రెండు పరస్పర విభిన్నమైన తీర్పులను వెలువరించింది. మార్చి 20న జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పులో ఇప్పటికే వివాహమై జీవిత భాగస్వామి బతికే ఉన్న వ్యక్తి ముందుగా విడాకులు తీసుకోకుండా చట్టబద్ధంగా మరొక భాగస్వామితో సహ జీవనంలోకి ప్రవేశించలేరని స్పష్టం చేశారు.
ఈ తీర్పు వెలువడిన కొన్ని రోజులకే డివిజన్ బెంచ్ ఇచ్చిన మరో తీర్పులో పెండ్లయిన పురుషుడు ఒక మహిళతో సహ జీవనంలోకి ప్రవేశించడం చట్ట ప్రకారం నేరం కాదని పేర్కొంది. మార్చి 20 నాటి కేసులో అప్పటికే వేర్వేరు భాగస్వాములతో వివాహం చేసుకున్న ఒక జంట తమ కుటుంబాల నుండి వస్తున్న బెదిరింపుల నుండి రక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను సింగిల్ బెంచ్ విచారించింది. తాము బార్యాభర్తలల్లా కలిసి జీవిస్తున్నామని, తమ ప్రాణాలకు ముప్పు ఉందని వారు వాదించారు. అయితే వారిద్దరూ విడాకులు తీసుకోనందున వారి సంబంధం చట్ట విరుద్ధమని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ అభ్యర్థనను వ్యతిరేకించింది.
ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన కోర్టు రక్షణ కల్పించడానికి నిరాకరించింది. పరస్పర మమకారంతో ఇద్దరు మేజర్లు కులం, మతం లేదా సామాజిక అడ్డంకులతో సంబంధం లేకుండా ఎటువంటి జోక్యం లేకుండా కలిసి జీవించే హక్కును కలిగి ఉన్నప్పటికీ ఈ హక్కు సంపూర్ణమైనది కాదని పేర్కొంది. ఈ తీర్పు వెలువడిన కొన్ని రోజులకే దీనికి విరుద్ధంగా జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాలతో కూడిన డివిజన్ బెంచ్ వివాహితుడైన ఒక పురుషుడు, 18 ఏండ్ల యువతికి సంబంధించిన వేరొక కేసును విచారిస్తూ వివాహితుడైన పురుషుడు, మేజర్ అయిన మహిళతో పరస్పర అంగీకారంతో సహ జీవనం చేయడం నేరంగా పరిగణించరాదని స్పష్టం చేసింది. పెళ్లయిన పురుషుడు, మేజర్ అయిన మహిళతో ఆమె సమ్మతితో సహ జీవనం చేస్తున్నంత మాత్రాన అది నేరం కాదని, నైతికతను, చట్టాన్ని వేరుగా ఉండాలని డివిజన్ బెంచ్ తెలిపింది.