జైపూర్: రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరించనున్నది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ మంత్రులంతా శనివారం రాజీనామా చేశారు. మంత్రుల నుంచి రాజీనామా పత్రాలను సీఎం అశోక్ గెహ్లాట్ సేకరించారు. తొలుత రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా శుక్రవారం విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రులంతా రాజీనామా చేయాలని మరో ఇద్దరితో కలిసి ఆయన ఒక ప్రతిపాదన చేశారు. దీంతో మంత్రులంతా రాజీనామా చేయాలని సీఎం గెహ్లాట్ కోరారు. శనివారం తన నివాసంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రులంతా రాజీనామా చేశారని ప్రతాప్ ఖాచార్యవాస్ తెలిపారు. దీంతో ప్రభుత్వం రీ-ఫార్మేషన్కు సంబంధించి ఒక ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ మీటింగ్ ఉంటుందని, అంతా అక్కడకు వెళ్తామన్నారు. సీఎం అశోక్ గెహ్లాట్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా తదుపరి సూచనలు ఇస్తారని వెల్లడించారు.
మరోవైపు మంత్రుల రాజీనామా అనంతరం సీఎం అశోక్ గెహ్లాట్ శనివారం రాత్రి గవర్నర్ నివాసానికి వెళ్లారు. గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలిసి మంత్రుల రాజీనామాలను అందజేయడంతోపాటు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ గురించి వెల్లడించారు.