ముంబై: సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ పోలీస్ చీఫ్ పరమ్ బీర్ సింగ్పై (Param Bir Singh) ఉన్న అన్ని కేసులను ఎత్తివేసింది. అలాగే 2021 డిసెంబర్లో జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేసింది. ఆ కాలంలో కూడా ఆయన డ్యూటీలో ఉన్నట్లు పేర్కొంది. బీజేపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయంపై మాట్లాడారు. పరమ్ బీర్ సింగ్పై శాఖాపరమైన విచారణను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) తప్పుపట్టిందని తెలిపారు. శాఖాపరమైన విచారణను మూసివేయాలని ఆదేశించిందన్నారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వల్ల ఆయన సస్పెండ్ అయ్యారని, అయితే అది తప్పని ఇప్పుడు రుజువైందని చెప్పారు. ఈ నేపథ్యంలో పరమ్ బీర్ సింగ్ సస్పెన్షన్ రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని వెల్లడించారు.
కాగా, 2021 ఫిబ్రవరి 25న ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి చెందిన మంబై నివాసం సమీపంలో బాంబులతో కూడిన వాహనం నిలిచి ఉండటం కలకలం రేపింది. ఈ కేసులో పోలీసు అధికారి సచిన్ వాజ్ను అరెస్టు చేశారు. అలాగే నాడు ముంబై పోలీస్ చీఫ్గా ఉన్న పరమ్ బీర్ సింగ్ను ఆ పోస్ట్ నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో ముంబైలోని హోటళ్లు, బార్ల నుంచి ప్రతి నెలా రూ.100 కోట్లు వసూలు చేయాలని పోలీస్ అధికారి సచిన్ వాజ్ను అప్పటి హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ ఆదేశించారని పరమ్ బీర్ సింగ్ ఆరోపించారు. అలాగే ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి.
మరోవైపు 2018 జనవరి నుంచి 2019 ఫిబ్రవరి వరకు థాణే పోలీస్ కమిషనర్గా ఉన్న పరమ్ బీర్ సింగ్, తప్పుడు కేసులు నమోదు చేస్తానని బెదిరించి రూ.1.25 కోట్లు వసూలు చేశారని బిల్డర్ కేతన్ తన్నా ఆరోపించాడు. అలాగే తన బార్లు, రెస్టారెంట్లలో రైడ్లు చేయకుండా ఉండేందుకు పరమ్ బీర్ సింగ్ రూ.9 లక్షలు వసూలు చేసినట్లు బిల్డర్, హాటళ్ల యజమాని బిమల్ అగర్వాల్ ఆరోపించాడు. రూ.2.92 లక్షల విలువైన రెండు స్మార్ట్ ఫోన్లను బలవంతంగా తనతో కొనిపించినట్లు గోరెగావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో 2021 జూలైలో పరమ్ బీర్ సింగ్, ఆరుగురు పోలీస్ అధికారులతో సహా 28 మందిపై కేసు నమోదైంది.
కాగా, మహారాష్ట్రలో నాడు అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి ప్రభుత్వం పరమ్ బీర్ సింగ్పై చర్యలు చేపట్టింది. క్రమశిక్షణారాహిత్యం, అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై ఆయనను సస్పెండ్ చేసింది. అలాగే పరమ్ బీర్ సింగ్పై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఏక్నాథ్ షిండే ప్రభుత్వం పరమ్ బీర్ సింగ్పై నమోదైన అన్ని కేసులను ఎత్తివేసింది. అలాగే సస్పెన్షన్ ఆర్డర్ను రద్దు చేయడంతోపాటు సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.