లక్నో: భర్తకు ఉద్యోగం ద్వారా ఆదాయం లేకపోయినప్పటికీ, తన భార్యకు భరణం ఇవ్వాల్సిన బాధ్యత ఆ భర్తకు ఉందని అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం తెలిపింది. మాజీ భార్యకు నెలకు రూ.2,000 చొప్పున భరణాన్ని చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ భర్త దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. భార్యకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు ప్రకారం మనోవర్తిని రాబట్టేందుకు భర్తపై అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.
ఈ దంపతులిద్దరికీ 2015లో పెండ్లి జరిగింది. కొంత కాలం తర్వాత, తన భర్త, అతని బంధువులు వరకట్నం డిమాండ్ చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. 2016లో భర్త ఇంటిని విడిచిపెట్టారు. ఆమెకు నెలకు రూ.2,000 పోషణ భత్యం చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ తీర్పును భర్త హైకోర్టులో సవాల్ చేశారు. తన భార్య టీచింగ్ ద్వారా నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నదనే విషయాలను పరిగణనలోకి తీసుకోవడంలో ప్రిన్సిపల్ జడ్జి విఫలమయ్యారని ఆరోపించారు. తాను తీవ్ర అస్వస్థతకు గురయ్యానన్నారు.