శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ నార్వాల్ ప్రాంతంలో జరిగిన పేలుళ్ల ఘటనలో ప్రధాన సూత్రధారిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పాక్ ఉగ్రవాదుల సూచన మేరకు ఈ పేలుళ్లకు పాల్పడినట్లు సమాచారం. కత్రా బస్సు పేలుడులో సైతం నిందితుడు ప్రేమయం ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అతని సహాయకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత నెల జనవరి 21న దాదాపు అరగంట వ్యవధిలో రెండు బాంబులు పేలుళ్లు చోటు చేసుకున్నాయని డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. పేలుళ్ల ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారని, పోలీసుల ప్రత్యేక బృందం సమగ్ర విచారణ అనంతరం ఉగ్రవాది ఆరిఫ్ను అదుపులోకి తీసుకున్నారు. మూడేళ్లుగా పాక్ ఉగ్రవాదులతో సంబంధాలు నెరుపుతున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో శాస్త్రినగర్లో జరిగిన ఐఈడీ పేలుడులో ఆరిఫ్ హస్తం ఉన్నది.
తొలిసారిగా పెర్ఫ్యూమ్ ఐఈడీని స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. ఇంతకు ముందు ఇలాంటిది ఎన్నడూ స్వాధీనం చేసుకోలేదని, ఎవరైనా తెరవడానికి ప్రయత్నిస్తే పేలిపోతుందని తెలిపారు. ఇదిలా ఉండగా.. జంట పేలుళ్లలో ప్రధాన నిందితుడు ఆరిఫ్ రియాసి నివాసి కాగా.. అతను ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. 2016లో పర్మినెంట్ టీచర్గా నియామకమయ్యాడు. అతని మేనమామ ఖమర్ పాక్లోని కరాచీలో నివసిస్తున్నాడు. మరో ఉగ్రవాది ఖాసీం సైతం పాక్లో ఉన్నాడు. 2019 నుంచి ఆరిఫ్కు అతనితో పరిచయం ఉన్నది. ఖాసీం సూచనల మేరకే కత్రా నుంచి వస్తున్న బస్సును ఆరిఫ్ ఐఈడీ సహాయంతో పేల్చినట్లు పోలీసులు వివరించారు. రెండేళ్లలో ఆరిఫ్ మూడు పేలుళ్లకు పాల్పడగా.. పెర్ఫ్యూమ్ ఐఈడీ సైతం స్వాధీనం చేసుకున్నారు.