లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. పెద్ద కుమార్తె అదితి కూడా తల్లి డింపుల్ యాదవ్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నది. ఈ నేపథ్యంలో అఖిలేష్ రాజకీయ వారసురాలు ఆమే అన్న టాక్ వినిపిస్తున్నది. (Akhilesh Yadav’s Daughter Aditi) అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మరోసారి మెయిన్పురి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. యూపీ మంత్రి జైవీర్ సింగ్, బీఎస్పీకి చెందిన గుల్షన్ షాక్యాతో ఆమె తలపడుతున్నారు.
కాగా, అఖిలేష్ యాదవ్ పెద్ద కుమార్తె అదితి కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తల్లి డింపుల్ యాదవ్ గెలుపు కోసం ఆమెతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నది. తల్లి ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్నది. డింపుల్ను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నది. సోషల్ మీడియాలో కూడా ఆమె చురుకుగా ఉన్నది.
మరోవైపు అదితిని గమనించిన మీడియా జర్నలిస్టులు, ఆమె రాజకీయ ప్రవేశం చేస్తుందా? అని తల్లి డింపుల్ యాదవ్ను ప్రశ్నించారు. అయితే తన కుమార్తె లండన్లో చదువుతోందని ఆమె తెలిపారు. సెలవుల్లో భాగంగా ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. ‘జీవితంలో ప్రతి విషయాన్ని పిల్లలు నేర్చుకోవాలి. తన చుట్టూ ఏమి జరుగుతుందో ఆమెకు (అదితి) తెలుసు. నేను సంతోషంగా ఉన్నా’ అని డింపుల్ యాదవ్ అన్నారు. అఖిలేష్, డింపుల్ దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్ద కుమార్తె అదితి, రెండో కుమార్తె టీనాతోపాటు కుమారుడు అర్జున్ వీరి సంతానం.