లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ తన బాబాయ్ శివపాల్ యాదవ్ పాదాలు తాకారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చాటేందుకు ప్రయత్నించారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ గత నెలలో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రాతినిథ్యం వహించిన మెయిన్పురి లోక్సభ నియోజకవర్గానికి డిసెంబర్ 5న ఉప ఎన్నిక జరుగనున్నది. అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి కంచుకోట అయిన సైఫైలో ఆదివారం ఎన్నికల సభ జరిగింది. ఈ సందర్భంగా వేదిక పైకి వచ్చిన అఖిలేష్ యాదవ్ అక్కడ ఉన్న బాబాయ్ శివపాల్ యాదవ్ను చూశారు. ఆయన దగ్గరకు వెళ్లి పాదాలు తాకారు.
అనంతరం ప్రసంగించిన అఖిలేష్ యాదవ్ తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. బాబాయ్ను ఇతర బంధువులును ఎప్పుడూ కూడా దూరంగా పెట్టలేదని తెలిపారు. రాజకీయపరంగానే దూరం ఉందని, ఇప్పుడు అది కూడా లేదన్నారు. నేతాజీ (ములాయం సింగ్ యాదవ్) మన మధ్య లేని తరుణంలో ఉప ఎన్నిక జరుగుతున్నదని అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో దేశం మొత్తం ఈ ఎన్నిక వైపు చూస్తోందని అన్నారు. అయితే సమాజ్వాదీ పార్టీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
#WATCH | Samajwadi Party chief Akhilesh Yadav meets PSP chief Shivpal Yadav, touches his feet atop the stage while campaigning for the byelections in Mainpuri, UP pic.twitter.com/c82LOivUqb
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 20, 2022