న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ఎన్నికలైన యూపీ అసెంబ్లీ ఎన్నికలు కీలకమైనవని, ఈవీఎంల పట్ల ఎస్పీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈసారి బీజేపీ పోలింగ్ బూత్ల్లో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎస్పీ కార్యకర్తలకు ఇది పరీక్షా సమయం వంటిందని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ అఖిలేష్ పేర్కొన్నారు. సమయం వృధా చేయకుండా తమ ప్రాంతాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
బీజేపీ అప్రజాస్వామిక, అనైతిక చర్యలను అడ్డుకోవాలని పిలుపు ఇచ్చారు. గత ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధిని యోగి ఆదిత్యానాధ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకుంటోందని దుయ్యబట్టారు. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న బీజేపీకి బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎస్పీ ప్రతినిధి అనురాగ్ భదౌరియా అన్నారు. యూపీలో ఇటీవల జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన దుయ్యబట్టారు.