పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అకాలీదళ్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ బాదల్, ఆయన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కూడా ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి అన్ని జిల్లాల అధ్యక్షులు, సీనియర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ సంచలన ప్రతిపాదనను సమావేశం ముందు పెట్టారు. పార్టీ ఘోర పరాభవానికి నైతికంగా తానే బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు.
అంతేకాకుండా పార్టీ అధ్యక్ష బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీంతో సీనియర్లు, మిగతా నేతలు వారించారు. రాజీనామా చేయకూడదని తేల్చి చెప్పారు. తమతో సహా కింది స్థాయి కార్యకర్తలందరికీ తమ నాయకత్వంపై పూర్తి నమ్మకం ఉందని, అందులో అనుమానాలకు తావు లేదని నేతలు స్పష్టం చేశారు. చివరికి.. రాజీనామా నుంచి వెనక్కి తగ్గినట్లు పార్టీ పేర్కొంది.
పంజాబ్ ఎన్నికల్లో అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ బాదల్, ఆయన తండ్రి ప్రకాశ్సింగ్ కూడా ఓడిపోయారు. లంబి నియోజకవర్గం నుంచి ప్రకాశ్ సింగ్ బాదల్, జలాలాబాద్ నుంచి ఆయన కుమారడు, పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ బాదల్ పోటీ చేశారు. ఇద్దరూ ఆప్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.