యూపీ సీఎంగా రెండో సారి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ ఆనందీబెహన్ పాటిల్ యోగితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్షా, జేపీ నడ్డాతో పాటు ఇతర ప్రముఖులు, కశ్మీర్ ఫైల్స్ సినిమా బృందం ప్రత్యేక ఆహ్వానితుల కోటాలో రానుంది. అయితే.. సీఎం యోగితో పాటు మరో 50 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందులో 8 మంది మహిళలున్నట్లుగా తెలుస్తోంది.
అయితే.. మంత్రివర్గ కూర్పుపై సీఎం యోగి ఇప్పటికే రెండు దఫాలుగా అధిష్ఠానంతో చర్చలు జరిపారు. ఈసారి కూడా యోగి కేబినెట్లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారు. ఎన్నికల్లో ఓటమి పాలైనా…. గతంలో డిప్యూటీ సీఎం చేసిన కేశవ ప్రసాద్ మౌర్యనే తిరిగి… డిప్యూటీ సీఎంగా కొనసాగిస్తారు. అయితే గతంలో దినేశ్ శర్మ మరో డిప్యూటీ సీఎంగా వుండేవారు. ఆయనను తప్పించి, యోగి కేబినెట్లో న్యాయ మంత్రిగా ఉన్న బ్రజేశ్ పాఠక్ను డిప్యూటీ సీఎంగా తీసుకోనున్నారు. ఈయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అగ్రనేత. ఆ సామాజిక వర్గంలో ఈయనకు విశేషమైన పలుకుబడి ఉంది.
ఇక యోగి కేబినెట్లోకి ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడై, పీఎంవోలో పనిచేసి, విశేష పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఏకే శర్మను యోగి తన టీంలోకి తీసుకోనున్నారు. ఈయన ప్రస్తుతం యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతల్లో వున్నారు. ఈయనతో పాటు… ఏకే శర్మ, బేబి రాణి మౌర్య, బ్రజేశ్ పాఠక్, జితిన్ ప్రసాద, అసిమ్ అరుణ్, స్వతంత్ర దేవ్ సింగ్, దినేశ్ కార్తీక్, సందీప్ సింగ్, అరుణ్ వాల్మీకి, ఆశీష్ పటేల్, సంజయ్ నిషాద్, దయాశంకర్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, రవీంద్ర జైస్వాల్ తదితరులు ఉండనున్నారు.