ముంబై, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో శరద్ పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి లోక్సభ నియోజకవర్గంలో ఈసారి వదిన, ఆడపడుచుల మధ్య రసవత్తరమైన పోటీ జరుగనున్నదనే ప్రచారం సాగుతున్నది.
ఆ స్థానంలో ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై పోటీకి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన భార్య సునేత్ర పవార్ను నిలబెట్టనున్నారనే వార్త చక్కర్లు కొడుతున్నది. ఇటీవల బారామతిలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో అజిత్ పవార్తో సునేత్ర ఫొటోలు కనిపించడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నది. దీనిపై సుప్రియా సూలే ఆదివారం స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నికల్లో పోటీచేయవచ్చన్నారు.