పార్టీని వీడుతారని జోరుగా ప్రచారం ఖండించిన అజిత్ పవార్, ఎన్సీపీ
ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో అజిత్ పవార్ నేతృత్వంలో చీలక రానున్నదనే ప్రచారం జోరుగా సాగుతున్నది. అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వంలో చేరతారనే ప్రచారం ఒకవైపు సాగుతున్నది. ఈ నేపథ్యంలో ముంబైలో జరిగిన పార్టీ కీలక సమావేశానికి అజిత్ పవార్ హాజరుకాకపోవడం ఈ చర్చకు మరింత ఊతమిస్తున్నది. తాను పార్టీలోనే ఉంటానని అజిత్ పవార్ చెప్తున్నా ఆయన చుట్టూనే మహారాష్ట్ర రాజకీయాలు సాగుతున్నాయి. మరోవైపు అజిత్ పవార్ను మహావికాస్ అఘాడీ నేతలు అవమానిస్తున్నారని, ఆయన చిత్తశుద్ధిని శంకిస్తున్నారనే అర్థంతో బీజేపీ నేతలు అజిత్ పవార్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుండటం కూడా ఆయన బీజీపీకి దగ్గరవుతున్నారనే ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి.
పార్టీలోనే ఉంటా : అజిత్ పవార్
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహకంగా శుక్రవారం శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎన్సీపీ కీలక నేతలంతా హాజరైనా అజిత్ పవార్ మాత్రం రాలేదు. ఇదే సమయంలో ఆయన పుణెలోని మరో కార్యక్రమంలో పాల్గొనటం చర్చనీయాంశమైంది. అయితే, ముందే షెడ్యూల్ చేసిన కార్యక్రమం ఉన్నందువల్ల ముంబై సమావేశానికి వెళ్లలేదని, అజిత్ పవార్ స్పష్టం చేశారు. అజిత్ పవార్ బీజేపీలో చేరబోతున్నారని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను అయన ఖండించారు. అజిత్ పవార్ పార్టీలోనే ఉంటారని ఎన్సీపీ స్పష్టం చేసింది.