Mamata Benerjee | కోల్కతా, నవంబర్ 19: రైల్వే చార్జీలు, ప్రయాణికుల భద్రత విషయంలో పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైలు టికెట్ల విషయంలో తీసుకొచ్చిన ‘డైనమిక్ ప్రైసింగ్’ విధానాన్ని వెనక్కు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రయాణికుల భద్రతపై మరింత దృష్టి పెట్టాలని ఆదివారం ఎక్స్ పోస్టులో సూచించారు.
ఒక్కోసారి విమానాల టికెట్ల కంటే రైలు టికెట్ల ధరలు అధికంగా ఉంటున్నాయని మమత పేర్కొన్నారు. తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన రైళ్లు ఒకదానికొకటి ఢీకొట్టకుండా నియంత్రించే పరికరాలు, ఇతర చర్యలను ఎందుకు ఉపయోగించడం లేదని ప్రశ్నించారు.