న్యూఢిల్లీ: రెండు నెలల తర్వాత యూఏఈకి ఎయిరిండియా విమానాలు ఎగరనున్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా ఏప్రిల్ 24న విమాన సర్వీసులను నిలిపివేశారు. అయితే ప్రస్తుతం భారత్లో పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గడంతో సరిగ్గా రెండు నెలల తర్వాత మహారాజా తన సర్వీసులను పునరుద్ధరించనుంది.
కరోనా నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమాన రాకపోకలపై యూఏఈ ఏప్రిల్ 24న నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నిషేధాన్ని జూన్ 30 వరకు పొడిగించింది. అయితే కరోనా ఉధృతి తగ్గడంతో భారత్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కాగా, ఇప్పటికే దుబాయ్ నుంచి భారత్కు విమానాలు నడుస్తున్నాయి. అయితే భారత్ నుంచి వెళ్లే విమానాలపై మాత్రం నిషేధం ఉంది. యూఏఈ పౌరులు, దౌత్యవేత్తలు, ఎంపిక చేసిన గోల్డెన్ వీసా హోల్డర్లను మాత్రమే ఇండియా నుంచి యూఏఈకి తిరిగొచ్చేందుకు అనుమతిస్తున్నారు.